వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో మంగళవారం వీఆర్ఏల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు
– కందుకూరు, జూలై 25
మేడ్చల్, జూలై 25(నమస్తే తెలంగాణ): వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగాలను నిర్ధారణ చేస్తూ, పేస్కేల్ ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వీఆర్ఏలు అందరూ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అర్హత ప్రకారం వీఆర్ఏలతో భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 303 మంది వీఆర్ఏలు లబ్ధి పొందనున్నారు. మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, నీటిపారుదల తదితర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వీఆర్ఏతో భర్తీ చేయనున్న నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన వీఆర్ఏల మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా జేఏసీ చైర్మన్ చిన్నోళ్ల మోహన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ…
మోహన్:- సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని ప్రభుత్వం ఇచ్చింది. కేవలం రూ.11,500 గౌరవ వేతనానికి పరిమితమై కుటుంబం గడవటం చాలా కష్టంగా ఉండేది. ప్రభుత్వం పేస్కేల్ ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించింది. 2014 నుంచి తాము పడ్డ కష్టాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముగింపు పలికారు.
మోహన్: మా బాధలు గుర్తించి, న్యాయం చేసిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. ప్రజలకు ఉన్నతంగా సేవలందించిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాం. డిగ్రీ చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్ పోస్టును ఇవ్వనుండటం హర్షనీయం.
మోహన్: వీఆర్ఏల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో ముగిని తేలుతున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో లబ్ధి పొందిన 303 మంది కుటుంబ సభ్యులతో సీఎంను కలిసి కృజ్ఞతలు తెలుపుతాం. వీఆర్ఏలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. 2014 నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రూ.11,500 వేతనానికి పరిమితమైన మేం ఆఫీసర్ సబార్డినేట్గా రూ.28 వేలు, జూనియర్ అసిస్టెంట్గా రూ.33 వేలు జీతం తీసుకోబోతున్నాం.
వీఆర్ఏలకు పే స్కేల్ ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి మంచి జీవితం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం అనుకున్నట్టుగానే మా న్యాయం చేసింది. అన్ని వర్గాలకు న్యాయం చేయడం సీఎం కేసీఆర్ ఒక్కరికే సాధ్యం. మా కుటుంబాలన్నీ ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాయి. ఇది మా జీవితాలకు కొత్త వెలుగు. మాకు ప్రమోషన్లు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. ఇదంతా కేసీఆర్ చలవే.
– అరుణ, వీఆర్ఏ, యాడారం
సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు పే స్కేల్తో గౌరవం కల్పిస్తారని ఎప్పుడు అనుకోలేదు. ఎంతో కాలంగా చాలీచాలనీ వేతనాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాం. సమాజంలో కూడా పెద్ద గౌరవం ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సీఎం కేసీఆర్ గౌరవం కల్పించారు. తమతో పాటు తమ పిల్లలకు ప్రభుత్వం బంగారు భవిష్యత్ ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది.
– ప్రసాద్, వీఆర్ఏ, దేవర యాంజాల్