సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో వివిధ పథకాల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, జోనల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. మౌలిక సదుపాయాల కోసం చేపట్టిన అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
రోడ్డు వెడల్పులో భాగంగా వేగంగా ఆస్తుల సేకరణ చేసి రోడ్డు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని, శానిటేషన్ సమర్థవంతమైన నిర్వహణకు స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుగునకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతర్గత రోడ్లను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ఎస్ఎన్డీపీ పనులను వెంటనే పూర్తి చేసేందుకు మెటీరియల్ను పెంచాలని ఇంజినీరింగ్ అధికారులను కోరారు.
అలాగే నూతనంగా మంజూరైన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్ సీఎస్ఆర్ పద్ధతిలో చేపట్టిన వివిధ రకాల పనులను త్వరగా పూర్తి చేయాలని, చెరువుల సుందరీకరణ పనులు కూడా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అగ్ని ప్రమా ద నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, వ్యాపార సంస్థలు కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా ప్రత్యేక దృష్టి సారించాలని జోనల్ కమిషనర్లను మేయర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఎన్సీ జియాఉద్దీన్, సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, శంకరయ్య, మమత, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ సామ్రాట్ పాల్గొన్నారు.