సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా ఎన్నికలు అనగానే ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు రాజకీయ పార్టీలు ఉపక్రమిస్తుంటాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉల్లంఘనులు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని భారత ఎన్నికల సంఘం పక్కాగా అమలు చేస్తున్నది. నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపుతున్నది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు 247 ఫిర్యాదులు రాగా, వాటన్నింటినీ వంద నిమిషాల్లో పరిష్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సీ-విజిల్ యాప్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
సీ విజిల్లో ఫిర్యాదులను పరిశీలిస్తే..అత్యధికంగా జూబ్లీహిల్స్ నుంచి 69 రాగా, ఆ తర్వాత ఖైరతాబాద్ నుంచి 60, సనత్నగర్లో 33, చాంద్రాయణగుట్టలో 15, కంటోన్మెంట్లో 10, యాకత్పురలో 10, అంబర్పేటలో 7, చార్మినార్ నుంచి 5 ఫిర్యాదులు రాగా, అధికారులు పరిష్కరించారు.
‘సీ-విజిల్’ యాప్ను ఈ ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా వినియోగించుకోవచ్చు. గూగుల్ లేదా ప్లేస్టోర్లో సీ-విజిల్ యాప్ అని టైపు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఉన్న చోటు నుంచే ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఉల్లంఘనలకు సంబంధించిన చిత్రాలను తీసి ఫిర్యాదు చేస్తే చాలు. ఈ సమయంలో ఫిర్యాదు చేసే వ్యక్తి తమ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదు. వారి వివరాలు గ్రూప్లో ఉంటాయి. ఫిర్యాదుకు సంబంధించిన ఫొటో కానీ రెండు నిమిషాల నిడివితో ఉన్న వీడియోలు కానీ యాప్లో అప్లోడ్ చేయాలి. వంద నిమిషాల్లో సమస్యను పరిష్కారిస్తారు. ఆ తర్వాత సంబంధిత ఫిర్యాదుదారుడి ఐడీకి సందేశం పంపిస్తారు.
రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో పాటు సాధారణ ప్రజలు చేసిన ఫిర్యాదులు 5 నిమిషాల్లోనే జిల్లా ఎన్నికల అధికారి నియంత్రణలోని మానిటరింగ్ సెల్కు వెళ్తుంది. అక్కడి నుంచి క్షేత్రస్థాయి పరిశీలనలోని ఎంసీసీ, ఫ్లయింగ్ స్కాడ్లకు చేరుతుంది. వారు 15 నిమిషాల్లో క్షేత్రస్థాయి విచారణ చేస్తారు. ఆ నివేదికను 30 నిమిషాల్లో రిటర్నింగ్ అధికారికి వెళ్లేలా చూస్తారు. దానిని రిటర్నింగ్ అధికారి 45 నిమిషాల్లో పరిశీలిస్తారు. అక్కడ నిర్ధారణ కాకపోతే ఫిర్యాదు జిల్లా ఎన్నికల అధికారి పరిష్కరిస్తారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుకు వంద నిమిషాల్లోనే పరిష్కారం చూపుతారు.