సిటీబ్యూరో, ఏప్రిల్ 19 ( నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో బస్సులు అందుబాటులో లేక బస్టాపుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మండుతున్న ఎండల్లో సమయానికి బస్సులు రాక నానా యాతన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచి ప్రయాణికులను ఎండ నుంచి రక్షించాల్సింది పోయి.. అదే ఎండల కారణంగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సుల సంఖ్య కుదిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాల కోసం చాలా మంది బస్సులపై ఆధారపడుతుంటారు. ఇది నిరంతర ప్రక్రియ. పలాన సమయంలో ప్రయాణాలు రద్దు చేసుకోండి అంటే జీవిత బండి నడిచే పరిస్థితి ఉండదు. కంపెనీల్లో షిఫ్టుల ప్రకారం పనులుంటాయి. ఉదయం ఉద్యోగాలకు వెళ్లిన వాళ్లు మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వస్తుంటారు. మరోవైపు ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులు ఉదయం బయలుదేరితే మధ్యాహ్నం నగరానికి చేరుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బస్సుల సంఖ్య తగ్గిస్తే వారంతా తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. మండుతున్న ఎండల్లో బస్సులు లేక పిల్లలు, వృద్ధులతో వారంతా ఎలా గమ్యస్థానాలకు చేరుకోవాలో చెప్పాలని ప్రయాణికులు నిలదీస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి.. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గించడం మోసం చేయడమేనని వాపోయారు.
గ్రేటర్ జనాభా కోటి మించింది. ఈ పరిస్థితిలో వారి రాకపోకలకు నగరంలో కనీసం 7వేల బస్సులు సమకూర్చాల్సిన అవసరం ఉందని ఇప్పటికే రవాణా రంగ నిపుణులు నివేదికలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ బస్సుల సంఖ్య గ్రేటర్ జనాభాకు తగ్గట్టు పెంచలేదు. ఆర్టీసీ నష్టాల కారణంగా బస్సుల సంఖ్య పెంచలేకపోతున్నామంటూ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో 2800 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా ఇందులో ప్రస్తుతం 2600 బస్సులు నడుస్తున్నాయి. 30వేల ట్రిప్పులు కొనసాగుతున్నాయి. ఇవి సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సుల సంఖ్య కుదించడం ప్రయాణికులకు మరిన్ని ఇబ్బందులు కల్గించడమేనని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ సమస్య నగరంలో జఠిలంగా మారింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల ట్రిప్పులు తగ్గిస్తే సాయంత్రం 4 నుంచి ట్రాఫిక్ సమస్య మరింత పెరగనున్నదని అంటున్నారు.
నగరంలో మధ్యాహ్న సమయంలో బస్సులను తగ్గించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గంటల కొద్దీ వేచి చూసినా బస్సులు రావడం లేదు. చివరకు క్యాబ్లు, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు.
సరిఫడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆర్టీసీ బస్సులను తగ్గించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. అసలే వేసవి కాలం ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడుతున్నారు. కనీసం ఉన్న బస్సులనైనా యథావిధిగా పునరుద్ధరించి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలి.
నగర శివారు ప్రాంతమైన హయత్నగర్ చుట్టుపక్కల గ్రామాల నుంచి నగరానికి వివిధ పనుల నిమిత్తం వేలాది సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల సంఖ్య సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ ఉన్న బస్సుల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కుదించడం సరైన నిర్ణయం కాదు. గత ప్రభుత్వ హయాంలో పది నిమిషాలకు ఒకసారి బస్సులు నడుస్తుండేది.