బడంగ్పేట, నవంబర్ 18 : బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని గజమాలతో ఘనంగా సత్కరించారు. వేద మంత్రాలతో మంత్రికి బ్రాహ్మణ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.
బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బ్రాహ్మణ సంఘాల నాయకులు ప్రకటించారు. మహేశ్వరం నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించుకుంటామని సంఘం నాయకులు శపథం చేశారు. కారు గుర్తుకు ఓట్లు వేసి గెలిపిస్తామన్నారు. గతంలో బ్రాహ్మణులను ఓటు బ్యాంక్గా మాత్రమే ఉపయోగించుకున్నారని సంఘం నాయకులు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా బ్రాహ్మణ పరిషత్లను ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు. గతంలో ఎన్నడు అర్చకులకు వేతనాలు ఇవ్వలేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణులకు వేతనాలు ఇస్తున్నామన్నారు. కోట్ల రూపాయలతో బ్రాహ్మణ భవనం నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ చైర్మన్ వేణుగోపాల చారి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆయచితం శ్రీధర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి, మహేశ్వరం నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, బ్రాహ్మణ ఐక్య వేదిక అధ్యక్షులు రాఘవ రావు, బ్రాహ్మణ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్, అనురాధ, హన్మంత చారి, శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షులు చక్రవర్తుల జగన్మోహన్ చార్యులు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు పెద్ద బావి శోభ ఆనంద్ రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.