ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లుగా.. ఈ సీజన్లో మళ్లీ వానలు దంచికొట్టాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు వర్షం పడుతూనే ఉంది. కుండపోత వానల నేపథ్యంలో సహాయక చర్యలపై బల్దియా దృష్టి సారించింది. రాత్రి నుంచే అధికారులు వాతావరణ స్థితిగతులను పర్యవేక్షించారు. లోతట్టు ప్రాంతా ల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ, వరద ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. రహదారులపై నీరు నిలువకుండా ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటలలోపు నగర ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, వివేకానంద, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్ తదితరులు వరద ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మేయర్ విజయలక్ష్మి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని ఆరా తీశారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఇదిలా ఉంటే జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో వాటర్బోర్డు అధికారులు ఆరు గేట్లను ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో భారీగా వరద నీరు చేరే అవకాశం ఉండటంతో మూసారం బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేస్తున్నట్లుగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ వెల్లడించారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ) : నగరంలో వానలు దంచికొడుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు భారీ వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యలపై బల్దియా దృష్టి సారించింది. ప్రధానంగా కుండపోత వానలతో నగరంలోని కూకట్పల్లి, నిజాంపేట్, ఖైరతాబాద్, ఆల్విన్ కాలనీ, మియాపూర్, హైదర్ నగర్, మైలార్ దేవ్పల్లి, హఫీజ్ పేట్, కేపీహెచ్బీ, గచ్చిబౌలి, గాజులరామారం, మేడ్చల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో రాత్రి నుంచే వాతావరణ స్థితిగతులను పర్యవేక్షిస్తున్న మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బంది లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే ప్రధాన మార్గాల్లో నీటిని తొలగించి రవాణాకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. కాగా ప్రగతినగర్లో బాచుపల్లి నాలాలో ప్రమాదవశాత్తు నాలుగేండ్ల బాలుడు మిథున్ పడి మృతి చెందాడు. బాచుపల్లి నాలా కలిసే ప్రగతి నగర్ తుర్క చెరువులో డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. కాగా వచ్చే ఐదు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు.
వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఈవీడీఎం సిబ్బంది మోహరించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే… రాకపోకలు, వాటర్ నిలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయితే సోమవారం రాత్రి కురిసిన భారీ వానలు, తెల్లవారుజామున 5గంటలకు మొదలైన వాన నగర వ్యాప్తంగా విస్తరించగా… మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆగి ఆగి వర్షం పడుతూనే ఉంది. ప్రధానంగా కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో నమోదైన భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు బల్దియా పరుగులు తీసింది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఉదయం 5.30గంటల నుంచే సహాయక చర్యలను మొదలు పెట్టింది. 8 గంటలలోపు నగరంలోని నాలా పరీవాహక ప్రాంతాలు, వరదనీరు చేరే ఏరియాల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్తోపాటు కార్పొరేటర్లు చేరుకుని వరద పరిస్థితిని పర్యవేక్షించారు. తార్నాక డివిజన్ పరిధిలో పర్యటించిన డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, మేయర్ సహాయక చర్యలను ముమ్మరం చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. మియాపూర్ సర్కిల్లో పటేల్చెరువు తెగిపోవడంతో మంగళవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువుల వరద పరిస్థితిని గమనించి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల కట్టల పునరుద్ధరణ, స్లూయిస్ మరమ్మతుల కోసం 191 పనులను చేపట్టినట్లు తెలిపారు. పటేల్ చెరువు స్లూయిస్ తెగిపోయి పలు కాలనీల్లో వరద వచ్చినందున ముందుగా తెగిపోయిన కట్టను తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని, మత్తడి ద్వారా చెరువులోని నీటిని పంపించే ఏర్పాటు చేయాలని లేక్స్ ఎస్ఈకి సూచించారు. కమిషనర్ ఆదేశాల మేరకు వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టి, వరదను కూడా మళ్లించి కాలనీల్లోకి వరద పారకుండా చర్యలు తీసుకున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్ రోనాల్డ్ రోస్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. మంగళవారం భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి.. అధికారులతో కలిసి సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… హిమాయత్సాగర్ గేట్లు ఎత్తిన సందర్భంగా మూసీ పరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించాలన్నారు. నగరవాసులు సమస్యలు ఎదురైతే సహాయం కోసం జీహెచ్ఎంసీ హెల్ప్లైన్ నంబర్ 040 – 2111 1111 లేదా డయల్ 100 లేదా ఈవీడీఎం కంట్రోల్ రూం నంబరు 90001 13667ను సంప్రదించాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే ప్రజలు బయటకు రావాలని కమిషనర్ నగరవాసులను కోరారు.
సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేసిన మేయర్..
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉదయమే సెల్ కాన్ఫరెన్స్ ద్వారా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్, జీహెచ్ఎంసీ సమన్వయంతో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలన్నారు. బుధవారం కూడా భారీ వర్షాలున్న నేపథ్యంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జంట జలాశయాల గేట్లు ఎత్తినందున మూసీ పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. గోషామహల్ చుడీబజార్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించిన 16 కుటుంబాలకు చెందిన 42 మందిని కలిసి అక్కడి వసతులపై ఆరా తీశారు.
నిండుకుండల్లా జంట జలాశయాలు
భారీ వానలకు నగరంలోని జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. ఎగువ నుంచి వస్తున్న నీటితో జలశయాల నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో ఉస్మాన్ సాగర్, హియాయత్ సాగర్ జలాశయాల ఆరు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తారు. హిమాయత్ సాగర్ నుంచి 4120 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగర్ నుంచి 852 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం రెండింటిలోకి 6వేల క్యూసెక్కుల నీరు జలాశయాల్లోకి చేరుతోందని సాయంత్రం 6 గంటలకు వెల్లడించిన వాటర్ బోర్డు గణాంకాల్లో తేలిపారు. హుస్సేన్ సాగర్లోనూ క్రమంగా నీటి మట్టం పెరుగుతున్నది. 513.41మీటర్ల పూర్తి స్థాయి నీటిమట్టానికి వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన బల్దియా సిబ్బంది, వరద నీటి ప్రవాహం నియంత్రణపై దృష్టి సారించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా చేశారు.
తెల్లవారుతూనే.. కుండపోత
మేడ్చల్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్షం కురిసింది. దీంతో 10 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ అమోయ్కుమార్ ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రజలకు వచ్చే ఇబ్బందులపై తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎం.డి దాన కిశోర్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడ నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెట్లు, కొమ్మలు కూలితే వెంటనే తొలగించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎగువ నుంచి భారీ వరదలు వస్తున్న నేపథ్యంలో హుస్సేన్సాగర్, ఉస్మాన్సాగర్ వాటర్ లెవల్స్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులకు సూచించారు. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలు సైతం అవసరమైతేనే బయటకు రావాలని, అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని కోరారు.
ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు
వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాం. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేశాం. జిల్లాలోని మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం.
లోతట్టు పాంతాల్లో వరదనీటిని ఎప్పటికప్పుడు తొలగించేలా చూస్తున్నాం.
– మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్
నగరంలో నమోదైన వర్షపాతం ( మిల్లీమీటర్లలో)
జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదు వివరాలు