సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 6న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే ర్యాలీపై బజరంగ్ దళ్, వీహెచ్పీ తదితర సంస్థల ప్రతినిధులతో సోమవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈఎంఆర్ఐ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్, ఆర్అండ్బీ, టీఎస్ఆర్టీసీతో పాటు ఆయా విభాగాల అధికారులు రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ర్యాలీ రూట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. సమస్యలను సృష్టించే వారిని నిర్వాహకులు గుర్తించాలని తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే ర్యాలీలలో హాజరయ్యే వారి సంఖ్యకు తగ్గట్లుగా వలంటీర్లను నియమించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయా రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ైప్లె ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున క్యారేజీ వేలో వివిధ రకాలైన సామాగ్రి ఉందని, వాటిని త్వరగా ఖాళీ చేయాలని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఆయా విభాగాల అధికారులు ర్యాలీ సాఫీగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గౌలిగూడ రామ మందిరం నుంచి పుత్లీబౌలి, వైఎంసీఏ, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, బైబిల్ హౌస్, తాడ్బన్ హనుమాన్ టెంపుల్లో రూట్లో 12 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. ర్యాలీ కొనసాగే రూట్ను సీపీ ఆయా విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. సీపీతో పాటు నగర అదనపు సీపీలు విక్రమ్ సింగ్మాన్, సుధీర్బాబు జాయింట్ సీపీలు ఎం.శ్రీనివాసులు, విశ్వప్రసాద్, భజరంగ్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు శివరామ్, వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.