కొండాపూర్, ఆగస్టు 9 : ఐటీ కారిడార్లో ట్రాఫిక్ అంతరాయాలను తొలగించి సాఫీగా ప్రయాణం సాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన హైటెక్సిటీలోని పలు ప్రాంతాలు, కైత్లాపూర్ ఆర్ఓబీ, గోకుల్ప్లాట్స్, కేపీహెచ్బీ ఫోరం మాల్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్, రాడిసన్ తదితర ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, టీఎస్ఐఐసీ, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో భాగంగా అవసరమైన చర్యల గురించి అధికారులతో చర్చించారు. రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, వాటర్ లాగింగ్ పాయింట్ల గుర్తింపు, బాటిల్నెక్స్ తొలగింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఐటీ అభివృద్ధితో రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతున్న కారణంగా వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై కమిషనర్ అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ సందీప్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ రణవీర్రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు నర్సయ్య, శ్రీనాథ్, రాజశేఖర్, టీఎస్ఐఐసీ, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.