హైదరాబాద్ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వస్తున్న ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పాటు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 1:16 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి మహముద్ అలీతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఐదు బ్లాక్లలో నిర్మించారు. 20 అంతస్తుల్లో ‘ఏ’ బ్లాక్, 15 అంతస్తుల్లో ‘బీ’ బ్లాక్ నిర్మించారు. ‘బీ’ బ్లాక్ టెక్నాలజీ ప్యూజియన్ టవర్. ఇందులో అన్ని అంశాలకు సంబంధించిన బ్యాక్అప్తో కూడిన సాంకేతికత ఉంటుంది. డయల్ 100, మహిళల భద్రత, సైబర్ అండ్ నార్కొటిక్స్ క్రైమ్స్, ఇంక్యుబేషన్ సెంటర్లు ఇందులో ఉంటాయి. ఇక టవర్ ‘సీ’లో 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఇందులో 480 మంది కూర్చొనే ఆడిటోరియం ఉంది. టవర్ ‘డీ’లో మీడియా, శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. బ్లాక్ ‘ఈ’ లో కమాండ్ కంట్రోల్ అండ్ డాటా సెంటర్ అన్ని విభాగాలను సమన్వయం చేస్తుంది. సీసీటీవీ మానిటరింగ్, వార్ రూమ్ అండ్ రిసీవింగ్ రూమ్ కూడా ఉంది. 14, 15వ అంతస్తుల్లో తెలంగాణ పోలీసుల చరిత్రను చూపించే విధంగా మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు.