సిటీబ్యూరో, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ఎన్నికల అధికారులు పనిచేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు. శేరి లింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంటు నియోజవర్గ ఎన్నికల నిర్వహణపై వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, శేరి లింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహలతో కలిసి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శశాంక మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, రీపోలింగ్కు ఆస్కారం లేకుండా నిర్వహించారని ఏఆర్ఓలను, నోడల్ అధికారులను ఆదేశించారు. చేవెళ్ల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 29,19,465 ఓటర్లున్నారని, 2,824 పోలింగ్ కేంద్రాలు, 53 సహాయక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన విధంగానే ప్రశాంతంగా నిర్వహించాలని, ఫామ్ నం.7, 8లను పెండింగ్లో పెట్టకుండా పరిష్కరించారని అధికారులకు సూచించారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణలో పోలింగ్ నిబంధనలు, మాక్ పోల్ నిర్వహించే విధానం, పోలింగ్ రోజు నిర్వర్తించవలసిన విధులపై శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించాలని ఏఆర్ఓలను ఆదేశించారు. పీఓలు, ఓపీఓలు, పొలీస్ సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.