మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 8 : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలను నుంచి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు. శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, అర్జీలు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో 193 ఫిర్యాదులు వచ్చా యి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, జనవరి 8: ప్రజావాణిలో వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారమయ్యేలా కృషి చేయనున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజావాణిలో మండలం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి, జనవరి 8: ప్రజల ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ రాజు అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ డీసీ, అల్వాల్ సర్కిల్ డీసీ శ్రీనివాస్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో రెండు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అల్వాల్ సర్కిల్ పరిధి.. ఓల్డ్ అల్వాల్లోని జిల్లా పరిషత్ బాలుర స్కూల్ కాంపౌండ్లో నుంచి గతంలో వేసిన డ్రైనేజీ పైపులైన్ వల్ల విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, వాటిని వెంటనే తొలగించి..పక్క నుంచి పైపులైన్ వేయాలని నాయకులు అల్వాల్ డీసీ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
కాప్రా, జనవరి 8: కాప్రా సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పి.ముకుందరెడ్డి, అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి మూడు ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు.