నాలుగు కో-ఆప్షన్ స్థానాలకు 15 మంది బరిలో…
18 మంది సభ్యులు, ముగ్గురు ఎక్స్అఫీషియో సభ్యులతో ఎన్నిక
రెండు మైనార్టీలకు, మరో రెండు స్థానాలు అనుభవజ్ఞులకు అవకాశం
రెండేళ్ల తర్వాత కొలిక్కి వచ్చిన ఎన్నిక..
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 26 : కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను ఈ నెల 28న ఖరారు చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. పాలకవర్గం ఏర్పడిన ఆరునెలల తర్వాత కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కావాలి. కానీ.. ఇక్కడ అనివార్య కారణాల వల్ల ఎన్నిక ప్రక్రియకు అంతరాయం కలగడంతో.. ఇప్పుడు ఈ ఎన్నికకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు స్థానాల కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కావాల్సి ఉంది. వీటిలో రెండు మైనార్టీవర్గానికి చెందిన మహిళ, పురుషునికి, మరో రెండు స్థానాల్లో అనుభవజ్ఞులైన ఒకటి మహిళకు, మరొకటి పురుషునికి అవకాశం ఉంది. వీరి ఎన్నిక కోసం ప్రస్తుతం మున్సిపాలిటీ పాలకవర్గంలో 18 మంది సభ్యులు ఉండగా.. ఎక్స్అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు ఎంపీకి కూడా వీరిని ఎన్నుకునేందుకు అవకాశం ఉంది. నాలుగు స్థానాలకుగాను 17 మంది నామినేషన్లు వేయగా వీరిలో స్క్రూట్నీలో ఇద్దరు తిరస్కరణకు గురికాగా 15 మంది పోటీలో నిలిచారు.
బరిలో వీరే…
నాలుగు కో-ఆప్షన్ స్థానాల కోసం 15 మంది బరిలో నిలిచారు. వీరిలో ఆదమ ప్రభాకర్రెడ్డి, గంగయెల్ల వెంకటేశ్, అన్నారం గోపాల్రెడ్డి, సన్న సత్తమ్మ, రావణకోల్ మంగమ్మ, కర్నాటి సువర్ణ, పద్మావతి గడ్డం, షేక్ అన్వర్, ఖదీర్షేక్, జెమ్మి దేవేందర్, షేక్ ఇబ్రహీమ్, లంబాడీ సత్తమ్మ, ముంతాజ్ బేగం, మహమ్మద్ ఖాదర్, మరొకరు బరిలో ఉన్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు కొంపల్లి సమావేశం మందిరంలో కో-ఆప్షన్ల సభ్యుల ఎన్నిక జరగనుంది. వీరిలో 21 మంది ప్రజా ప్రతినిధుల చేత మూజువాణి ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నిక అనంతరం నియామక పత్రాలను అందించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకున్నారు.
ఎవరిని వరించునో..?
గడిచిన రెండేళ్ల కాలం నుంచి ఇప్పటి వరకు కొంపల్లి మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు అది నుంచి అంతరా యం కలుగుతూ వచ్చింది. సభ్యుల మధ్య నెలకొన్న పోటీతో పాటు ఇతర కారణాల వల్ల ఇప్పటి వరకు ఎన్నిక కాకపోవడంతో గత రెండేళ్లుగా పార్టీ శ్రేణులు, ఉద్యమనాయకులు కో-ఆప్షన్ మెంబర్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న నాలుగు స్థానాలకు 15 మంది బరిలో నిలవడంతో ఎవరికి కో-ఆప్షన్ స్థానం దక్కుతుందో అనే ఆందోళన నెలకొంది. తమకంటే తమకు వస్తుందని.. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గడిచి న కొన్ని రోజుల నుంచి కో-ఆప్షన్ స్థానాల కోసం పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు మన్ననలను పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.