అమీర్పేట్ : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్న తీరు ఆదర్శవంతమని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. సనత్నగర్, అమీర్పేట్ డివిజన్లకు చెందిన 22 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారిలతో కలిసి చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి టీర్ఎస్ సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. నిరుపేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, సీఎం కేసీఆర్ సాధించిన ఈ ఘనత తెలంగాణ వాసులకు గర్వకారణమన్నారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి ఇప్పటివరకు 10 లక్షల మందికి లబ్ది చేకూరిందన్నారు. ఎక్కడా నిధుల లోటు తలెత్తకుండా అభివృద్ది, సంక్షేమాన్ని ఏకకాలంలో ముందుకు తీసుకువెళుతూ రాష్ట్రాన్ని అన్నింటా అగ్రగామిగా నిలుపుతున్న సీఎం కేసీఆర్ ప్రజలు అండగా నిలవాలన్నారు.