వడగండ్ల వానతో నష్టపోయిన అన్నదాతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలబడ్డారు. గురువారం సుడిగాలి పర్యటన చేసి ‘రైతన్నా.. నేనున్నా..’ అని భరోసానిచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలను చుట్టేసి, నష్టపోయిన పంటలను కండ్లారా చూసి కర్షకుల కన్నీళ్లు తుడిచారు. రైతులను ఆత్మీయంగా పలుకరిస్తూ ఆపన్నహస్తం అందించారు. ఉదయం నుంచి జిల్లాల పర్యటనలోనే ఉన్న సీఎం… అలుపెరుగకుండా, అవిశ్రాంతంగా రైతుల కోసం ముందుకు కదిలారు. మధ్యాహ్న భోజనాన్ని కూడా మంత్రులతో పాటు కాన్వాయ్లోనే చేయడం గమనార్హం. తానూ రైతు బిడ్డనేనని.. వ్యవసాయాన్ని కిందపడనీయనని చెప్తూ..వడగండ్ల బాధిత రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రైతులకు ఇచ్చేది నష్టపరిహారం కాదని.. పునరావాసం మాత్రమేనని చెప్పారు. తక్షణమే జీవో ఇచ్చి రైతులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కౌలు రైతులను కూడా కడుపులో పెట్టుకుంటామని, వారిని ఆదుకునే
బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో మంత్రులు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్నాయక్, మాజీమంత్రులు కడియం శ్రీహరి, రెడ్యానాయక్ తదితరులు