“ఇప్పుడు మీ స్కూల్ ఎలా ఉంది ? అని మంత్రి తలసాని విద్యార్థులను అడగ్గా, చాలా బాగుంది, థాంక్యూ అంకుల్ అంటూ చిన్నారులు బదులిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన మంత్రి ఇకపై మీ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపాల్సిన అవసరం లేదని సూచించారు.”
ఖైరతాబాద్/ బన్సీలాల్పేట్/ మారేడ్పల్లి, ఫిబ్రవరి 1 : రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచన మేరకే ‘మన బస్తీ.. మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‘మన బస్తీ.. మన బడి’ కార్యక్రమంలో భాగంగా సోమాజిగూడలోని రాజ్భవన్ పాఠశాలలో రూ.16,5,885 వ్యయంతో నిరంతర నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, రూ.13,11,940 వ్యయంతో ఏర్పాటు చేసిన డ్యుయల్ డెస్క్లు, రూ.2,60,944తో అమర్చిన గ్రీన్ చాక్ బోర్డులను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, డీఈవో రోహిణితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
అదేవిధంగా పద్మారావునగర్లోని మైలార్గూడలో రూ.18.92 లక్షల వ్యయంతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బన్సీలాల్పేట్ కార్పొరేటర్ హేమలత, జిల్లా విద్యాశాఖాధికారి రోహిణితో కలిసి ప్రారంభించారు. కంటోన్మెంట్ నాల్గవ వార్డు పికెట్లో రూ.36.28 లక్షల వ్యయంతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే జి.సాయన్న, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం పాఠశాలల్లో టాయిలెట్లు, తరగతి గదులు, పేయిటింగ్, నూతన ఫర్నీచర్ తదితర వాటిని పరిశీలించారు. సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్ జిల్లాలో 239 పాఠశాలలు ఎంపిక
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేని కారణంగానే చాలా మంది ప్రైవేట్ బడులకు వెళ్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలన్నీ ప్రైవేట్కు దీటుగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 239 పాఠశాలలను ఎంపిక చేసి రూ.44 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ నిధులతో అవసరమైన చోట ప్రహరీ గోడ, టాయిలెట్స్ నిర్మాణం, అభివృద్ధి పనులు, తాగునీటి సౌకర్యం, ఫర్నీచర్ కొనుగోలు తదితర 12 రకాల అభివృద్ధి పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ను తలపించేలా పాఠశాలల రూపు రేఖలు మారుతున్నాయని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు ఉచిత విద్యాబోధనతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేదని అన్నారు.
ఒక్కో విద్యార్థిపై రూ.లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నాం
గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలను పట్టిచుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోనే ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలు అభివృద్ధి చెందాయని చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై రూ.లక్షా 25 వేలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. సామాన్యుడి కుమారుడి నుంచి ధనవంతుల పిల్లల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే రోజులు వచ్చాయని.. ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలలను సకల సౌకర్యాలతో అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం విద్యా రంగానికి అధిక నిధులను వెచ్చిస్తూ విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయా రెడ్డి, గ్రంథాలయ సంస్థ హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె.ప్రసన్న రామ్మూర్తి, డిప్యూటీ డీఈవో సామ్యూల్ రాజ్, రాజ్భవన్ ఉన్నత పాఠశాల హెచ్ఎం కరుణశ్రీ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజులత, తదితరులు పాల్గొన్నారు.