హైదరాబాద్ నగరం.. ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామం.. ఐటీలో మేటిగా నిలువడమే కాదు.. ఇతర మెట్రో నగరాల కంటే.. మెరుగైన స్థానంలో దూసుకెళ్తున్నది. తొమ్మిదేండ్లలో హైదరాబాద్ సాధించిన ప్రగతి అంతా ఇంతా కాదు. సీఎం కేసీఆర్ అంకితభావం.. మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఈ మహానగరం ప్రపంచ పటంపై తన ఖ్యాతిని సగర్వంగా చాటుకుంటున్నది. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ.. మహానగరానికి గతంలో మేం ఇది చేశాం.. అది చేశాం.. అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు నగరాభివృద్ధికి ఎంతో సహకరించిందంటూ.. ఆ పార్టీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ.. ఒక్కసారి హైదరాబాద్ ప్రగతి ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. ౨౦౦౪-౧౪ పదేండ్లలో కాంగ్రెస్ హయాంలో నగరాభివృద్ధికి ఖర్చు చేసిన నిధులు కేవలం రూ.౨౨వేల కోట్లే.
అదే తెలంగాణ ప్రభుత్వం ౨౦౧౪-౨౩లో వెచ్చించిన మొత్తం ఏకంగా రూ.౮౮వేల కోట్లు. అంటే నగర ముఖచిత్రం మారేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిని ప్రదర్శించిందో అర్థమవుతున్నది. ఇక కేంద్ర ప్రభుత్వం కేవలం ౮.౨% నిధులిచ్చినా.. అభివృద్ధిలో మా వాటా ఉందంటూ.. బీజేపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. తొమ్మిదేండ్లలో దిమ్మతిరిగే రీతిలో నగరం అభివృద్ధి చెందడంతో గ్రేటర్ కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెప్పుకునేందుకు ఏమీ లేక.. సతమతమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం అభివృద్ధే ‘తారక’ మంత్రంగా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. నిన్నటిదాకా నగరం ఎలా ఉంది..? ఇప్పుడెలా మారిందో అక్షర రూపంలో ప్రజల ముందుంచుతున్నారు. అడుగడుగునా నగరవాసుల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు.
హైదరాబాద్ విశ్వనగరం… ఇప్పుడు అంతర్జాతీయంగా పెట్టుబడులకు స్వర్గధామం. ఐటీ, లైఫ్ సైన్సెస్లోనే కాదు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఇతర మెట్రో నగరాల కంటే మెరుగైన స్థానంలో దూసుకెళ్లడమంటే తొమ్మిదేండ్ల తెలంగాణ సర్కారు కృషి ఉంది. ఇది మన నగరం అనే అంకితభావంతో సీఎం కేసీఆర్, విశ్వనగరంగా మార్చి చూపాలనే మంత్రి కేటీఆర్ పట్టుదలతోనే ఈ మహానగరానికి ఇప్పుడు సెలబ్రిటీలు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల ప్రశంసలు దక్కుతున్నాయి. మరి… ఎన్నికలొచ్చాయ్! హైదరాబాద్ మహా నగరానికి గతంలో మేం ఇది చేశాం, అది చేశాం అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే! కేంద్రంలోని బీజేపీ సర్కారు నగరాభివృద్ధికి ఎంతో సహకరించిందంటూ బీజేపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు.
కానీ..ఒక్కసారి హైదరాబాద్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే పదేండ్లు పాలించిన కాంగ్రెస్ సర్కారు ఎంత ఖర్చు చేసింది? ఈ తొమ్మిదేండ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చింది? నగర ముఖచిత్రం మారేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిని ప్రదర్శించిందో అర్థమవుతుంది. అందుకే ఒక్కసారి ఆ నిధుల లెక్కేమిటో తేలిస్తే… గత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి తెలంగాణ సర్కారు నగరాభివృద్ధికి వెచ్చించిన నిధుల తీరులో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా! ఇక… నగరంలో పేర్చిన ప్రతి ఇటుకలోనూ మా వాటా ఉందంటూ నిత్యం మీడియా ముందు ప్రకటనలు చేసే కేంద్రంలోని బీజేపీ చిత్తశుద్ధి ఈ రికార్డుల్లో నల్లపూసే!!
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ ౧౩ (నమస్తే తెలంగాణ)
ఒకనాడు రెండు ఫ్లైఓవర్లు, ఒక టవర్ నిర్మిస్తేనే హైదరాబాద్ ప్రపంచ పటంలోకి ఎక్కిందంటూ డబ్బాలు కొట్టుకునే వాళ్లు. కానీ గడిచిన తొమ్మిదేండ్లలో నిర్మించిన ఫ్లైఓవర్లు, ఆర్యూబీలు, ఆర్వోబీల చిట్టా చాంతాడంత. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలైన మంచినీరు, మురుగునీటి పారుదలకు చేపట్టిన పనులైతే రానున్న వందేళ్లు పెరిగే జనాభా అవసరాలను సైతం తీర్చేలా ఉన్నాయి.
ముఖ్యంగా భావి హైదరాబాద్కు సైతం ఈ తొమ్మిదేండ్లలో చేసిన దానికంటే మించి ప్రణాళికలు ఇప్పటికే అమలులోకి కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లలో హైదరాబాద్ మహా నగరంలో మౌలిక సదుపాయాలకు వెచ్చించిన నిధుల మొత్తం ఏకంగా రూ.౮౮వేల కోట్ల పైమాటే. అంటే ఏడాదికి రూ.పదివేల కోట్లు!! దేశంలోని ఏ మెట్రో నగరంలోనూ ఈ స్థాయి అభివృద్ధి జరగలేదనేది జగమెరిగిన సత్యం.
హైదరాబాద్ అభివృద్ధి ప్రస్థానంలో ౨౦౦౪ నుంచి ౨౦౨౩ వరకు అంటే ౧౯ సంవత్సరాల పాటు ఆయా ప్రభుత్వాలు ఖర్చు చేసిన మొత్తం సుమారు రూ.౧,౧౦,౪౨౦.౯౯ కోట్లు. ౨౦౦౪ నుంచి ౨౦౧౪ వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిన నిధులు కేవలం ౨౦.౩౩ శాతం. అదే తెలంగాణ ప్రభుత్వం వెచ్చించిన మొత్తం ఏకంగా ౭౯.౬౬ శాతం. అంటే… పదేండ్లలో ఖర్చు చేసిన దానికంటే నాలుగు రెట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వెచ్చించి మౌలిక వసతులు కల్పించింది. అందుకే ఒకప్పటి హైదరాబాద్.. ఇప్పటి హైదరాబాద్ను చూసి తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, శ్రీలంక స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్, సినీ నటి లయ, అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు…కొనియాడుతున్నారు.
రాజకీయంగా తెలంగాణలో హైదరాబాద్ మహా నగరం అనేది అత్యంత కీలకమైనది. ౩౨ నియోజకవర్గాల హెచ్ఎండీఏ పరిధి అనేది రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్తున్నది. ఇప్పటికే ఖరారైన బీఆర్ఎస్ అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా చేసిన అభివృద్ధిని అక్షరరూపంలో ప్రజల ముందు ఉంచుతున్నారు. నిన్నటిదాకా నగరం ఎలా ఉంది? ఇప్పుడెలా రూపురేఖల్ని మార్చుకొని ప్రపంచస్థాయి నగరంగా ఎదిగిందనే వివరాలు, కండ్ల ముందు కనిపిస్తున్న నిర్మాణాలను ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా నగరాభివృద్ధిలో మంత్రి కేటీఆర్ మార్కు అనేది సామాన్యుడు మొదలు అంతర్జాతీయస్థాయి కంపెనీల సీఈవోల వరకు అనుభవంలో ఉన్నదే. ఇదే తరుణంలో ప్రతిపక్ష పార్టీలకు మాత్రం మహా నగరంపై ఎజెండానే కరువైంది. గత తొమ్మిదేండ్లలో దిమ్మతిరిగే రీతిలో నగరం అభివృద్ధి చెందిన దరిమిలా కాంగ్రెస్, బీజేపీలకు చెప్పుకునేందుకు ఏమీ లేకుండా పోయింది.
ఒక వైపు కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్న ౨౦౦౪-౧౪లోనే ఎంతో కొంత అభివృద్ధి జరిగిందని చెప్పుకునే ప్రయత్నం చేసినా… తొమ్మిదేండ్ల అభివృద్ధి ముందు అది దిగదుడుపుగా మారింది. దీంతో నగర కాంగ్రెస్ మాత్రమే కాదు… టీపీసీసీ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధిపై నోరుమెదపలేని దుస్థితి. మరోవైపు బీజేపీ నాయకులది మరో విచిత్రమైన పరిస్థితి. అభివృద్ధిలో మా వాటా ఉందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప… వాస్తవంగా లెక్కల్లోకి వెళితే తొమ్మిదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా నగరం, పట్టణాల అభివృద్ధికి వచ్చిన మొత్తం కేవలం రూ.౯,౯౩౪ కోట్లు మాత్రమే. ఇవి కూడా అమృత్, హృదయ్, ౧౪,౧౫ ఆర్థిక సంఘంతో పాటు స్వచ్ఛ భారత్ కింద వచ్చినవే. అంటే ఇందులో పట్టుమని పది శాతం కూడా హైదరాబాద్ నగరాభివృద్ధిలో లేవు. దీంతో వారికి కూడా హైదరాబాద్ మహా నగరంలో చెప్పుకునేందుకు కూడా ఏమీలేదు. అందుకే ఈ రెండు పార్టీలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభ్యర్థులే కరవయ్యారు.