గుండెల నిండా.. గులాబీ జెండానే.. పల్లెల నుంచి వచ్చే దారులన్నీ సభ వైపే సాగాయి.. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ఖారావాన్ని సీఎం కేసీఆర్ పూరించగా.. గులాబీదళం గర్జించింది. సమరానికి సై అన్నది.. ప్రజా ఆశీర్వాద సభ జనజాతరైంది. మహిళలు బతుకమ్మలతో ర్యాలీగా వచ్చి ఆటాపాటలతో అలరించారు.. యువత ఈలలు, డ్యాన్స్లతో హోరెత్తించారు.. జై కేసీఆర్ అంటూ నినదించారు..
వేలాదిగా తరలొచ్చిన ప్రజలు, నాయకులతో జడ్చర్ల గులాబీమయమైంది.. బుధవారం మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభకు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితోపాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సాగుజలాల రాకతో రైతుల మొఖాలు ఇప్పుడిప్పుడే తెల్లగవుతున్నాయన్నారు.
ఇదంతా కేవలం తొమ్మిదేండ్లలోనే చేసి చూపించామని చెప్పారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల వద్ద మోటర్లు బిగిస్తున్నారు.. మూడు, నాలుగు నెలల్లో నీళ్లను కండ్ల చూస్తామని, దీంతో కరువన్నది కన్నెత్తి చూడకుండా చూస్తామని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో సాగునీరు పారించి పాలుగారే జిల్లాగా మార్చుతామని స్పష్టం చేశారు. సీఎం ప్రసంగాన్ని జనం ఆసక్తిగా తిలకించారు