ఆసుపత్రి ఆవరణలోనే సభ ఏర్పాటు
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పనులు పరిశీలించిన నగర సీపీ, ఎమ్మెల్యే మైనంపల్లి
భారీ బందోబస్తులో నిమగ్నమైన నగర పోలీసులు
సికింద్రాబాద్/వెంగళరావునగర్/ఎల్బీనగర్/దుండిగల్, ఏప్రిల్ 25: హైదరాబాద్ మహా నగరం మూడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులతో ఆరోగ్య నగరంగా అవతరించబోతోంది. నగరంలోని మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రులకు నేడు పునాది రాళ్లు పడనున్నాయి. రాష్ట్రంలో వైద్యానికి పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నవశకానికి నాంది పలుకుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మంగళవారం పర్యటన నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాలు స్వాగత తోరణాలతో సందడిగా ఉన్నాయి. నేడు సీఎం కేసీఆర్ నగరంలోని సనత్నగర్, ఎల్బీనగర్, అల్వాల్లలో టిమ్స్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేయనున్నారు.
అధునాతన ఆసుపత్రి మా అదృష్టం
అధునాతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులోకి రానుండటం మా అదృష్టం. సీఎం కేసీఆర్ చలువతో ఎల్బీనగర్ నియోజకవర్గానికి అధునాతన ఆసుపత్రి వస్తోంది. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనకు అన్ని సిద్ధం అయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కారం కూడా త్వరలోనే జరుగుతుంది.
– ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్తా
సభకు భారీ ఏర్పాట్లు..
అల్వాల్లో జరగబోయే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లపై కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దూలపల్లిలోని ఆయన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు సోమవారం సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్, సెక్యూరిటీ తదితర అంశాలపై చర్చించారు. సనత్నగర్, ఎల్బీనగర్లలో కాకుండా అల్వాల్లో సీఎం సభ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మూడు వేలమందితో సభను భారీగా నిర్వహించాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో అధునాతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి మంగళవారం ఉదయం 10.45 గంటలకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ మేరకు దవాఖాన స్థలాన్ని, ఏర్పాట్లను ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సోమవారం పరిశీలించారు.