‘కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక్క రైతుబంధుతోటి బీఆర్ఎస్ గెలుస్తదా..? ఇయ్యాల ఆప్తవ్. ఎన్ని రోజులు ఆప్తవ్..? ముప్పై తారీఖు ఓట్లు.. మూడో తారీఖు ఓట్లు లెక్కబెడితే బీఆర్ఎస్ గెలువనే గెలిచే. ఆరు తారీఖు నుంచి మళ్ల దర్జాగా పడుతనే ఉంటది గదా రైతుబంధు. తొండ బిర్రు ఏందాకా ..? అంటే ఎనుగుల దాకా అని.. ఎన్ని రోజులు ఆపగలుగుతరు రైతుబంధును..? కేసీఆర్ బతికి ఉండంగ రైతుబంధు ఆగుతదా..? అది అయ్యే పనేనా..?’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, చింతా ప్రభాకర్లకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
‘కాంగ్రెసోళ్లు ధరణిని తీస్కపోయి బంగాళాఖాతంలో వేస్తమని అంటున్నరు. అంటే ఏమన్నట్టు..? ధరణిని తీసేసి మళ్ల ఎనకటి దళారీ రాజ్యం తెస్తరన్నట్టు. రైతులు దళారీల చుట్టు తిరిగి, లంచాలు పోసే పరిస్థితి తీసుకొస్తరన్నట్టు. కాబట్టి పొరపాటున కూడా కాంగ్రెస్ను గెలువనీయవద్దు. కాంగ్రెస్ గెలిస్తే అంతా బూడిదల పోసిన పన్నీరు అయితది’ అని హెచ్చరించారు. ‘రాష్ట్రంలో పేదలను, రైతులను, ప్రభుత్వ ఉద్యోగులను అందర్నీ సమదృష్టితో చూస్తున్నాం. తెలంగాణ ధనిక రాష్ట్రం అయితది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా శాలరీలు వస్తాయని చెప్పాను. రుజువు చేసి చూపెట్టాను. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి.
ఇండియా మొత్తంలో ఉద్యోగులకు హయ్యెస్ట్ శాలరీ ఇచ్చేది ఏదన్న ఉందంటే అది తెలంగాణ స్టేట్ మాత్రమే’ అని చెప్పారు. ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు.. ఉద్యోగాలు పోతాయని ఆర్టీసీ ఉద్యోగులు ఫైట్ చేశారు. మొన్ననే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. గవర్నర్ లేట్ చేయడం వల్ల ఆలస్యమైంది. గవర్నమెంట్ వచ్చిన తెల్లారి.. నెలలోపు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తాం’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని పెద్దలు చెప్పినట్లు.. నేను పాత మెదక్ జిల్లా బిడ్డనే. జన్మభూమి మీద ఎవరికైనా సరే, ఎక్కడున్నా ప్రేమ ఉంటది. అందుకే దయచేసి మళ్ల నేను అలిగేటట్టు చేయకండి. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.