సిటీబ్యూరో/బంజారాహిల్స్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ) : పీజేఆర్..ఇది పేరు కాదు. పేదోడి ప్రాణం. ఈ మూడు అక్షరాలు పలుకుతుంటే ప్రతి బస్తీవాసి కండ్లల్లో ఇప్పటికీ ఓ ఆత్మీయ అనుబంధం వికసిస్తుంది. వ్యక్తి దూరమై 16 ఏైండ్లెనా.. ఇప్పటికీ ఆ పేరు ప్రజల్లో కదలాడుతూనే ఉంటుంది. తనకు పేదోడి సంతోషమే హై కమాండ్ అని సగర్వంగా చెప్పి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి పీజేఆర్. కార్మిక నాయకుడిగా ప్రారంభమైన అతడి రాజకీయ జీవితం.. మంత్రిగా ఉన్నా కూడా ప్రజలతో ఆయన అదే బంధాన్ని కొనసాగించాడు.
సుమారు 36 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. 2007లో గుండెపోటుతో మరణించాక.. అతడి కుమారుడు విష్ణు వర్ధన్రెడ్డి పీజేఆర్ వారసుడిగా 16 ఏండ్లు కాంగ్రెస్ కోసం పనిచేశారు. నాన్న 36 ఏండ్లు.. కొడుకు 16 ఏండ్లు.. కాంగ్రెస్ కోసం పనిచేసినా హస్తం పార్టీ ఆ కుటుంబాన్ని మోసం చేసింది. జూబ్లీహిల్స్ టికెట్ విష్ణుకే అని చెప్పి.. ప్రచారం చేసుకోవాలని సూచించి.. చివరికి వేరొకరికి టికెట్ కేటాయించి పీజేఆర్ వారసుడిని కాంగ్రెస్ పార్టీ వంచించింది. ఇప్పుడు అదే జూబ్లీహిల్స్ ఇలాకాలో కాంగ్రెస్ పార్టీని ఓడించి పీజేఆర్ వారసత్వాన్ని కాపాడుకుంటామని, బీఆర్ఎస్ను గెలిపిస్తామని ఓటర్లు నినదిస్తున్నారు. ‘మా పీజేఆర్ వారసుడిని అక్కున చేర్చుకున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం’ అంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
కార్మిక నేతగా గుర్తింపు పొందిన పీజేఆర్ 1978లో తొలిసారిగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండేది. ప్రస్తుతం ఉన్న ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్లోని కొంతభాగం మొత్తం గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఉండేవి. అంతపెద్ద నియోజకవర్గానికి ఐదుసార్లు ఎమ్మెల్యే సేవలు అందించిన పీజేఆర్ అంటే నగరంలో తెలియనివారు ఉండరు. సహకార యువజన సర్వీసుల శాఖ, కార్యిక ఉపాధి, గృహ నిర్మాణ శాఖ, పౌరసరఫరాల శాఖల మంత్రిగా పనిచేశారు. సీఎల్పీ లీడర్గా వ్యవహరించారు. అంతేకాదు నగరంలో వెలిసిన అనేక బస్తీలు పీజేఆర్ హయాంలో ఏర్పడ్డవే. ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే వారికి రక్షణగా నిలబడి బస్తీలు ఏర్పాటు చేయించడమే కాకుండా వారికి అవసరమైన తాగునీరు, కరెంట్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే పీజేఆర్ పేరును నేటికి అనేక బస్తీల్లో పేదలు గుర్తించుకుంటారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను గొంతెత్తి ప్రశ్నించే పీజేఆర్కు తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. హైదరాబాద్లో మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు అనేక ఆందోళనలకు నాయకత్వం వహించడంతోపాటు హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాలు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. అంతటి ఘనమైన చరిత్ర కలిగిన పీజేఆర్ సుమారు 36 ఏండ్లపాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు.
2007లో పీజేఆర్ గుండెపోటుతో మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి విష్ణువర్ధన్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలైన విష్ణువర్ధన్రెడ్డి మరోసారి రానున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. పార్టీ పెద్దల సూచనలతో గత కొంతకాలంగా నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసుకుంటున్నాడు. అయితే తనను ధిక్కరించారన్న కోపంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చివరి నిమిషంలో నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధంలేని మాజీ భారత క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్కు టికెట్ ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విష్ణువర్ధన్ రెడ్డి షాక్కు గురయ్యారు. తన తండ్రి పీజేఆర్ సుమారు 36 ఏండ్లపాటు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారని, తాను గత 16 ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తుండగా.. రేవంత్రెడ్డి తనను మోసం చేశారంటూ విష్ణువర్ధన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ బిడ్డగా హక్కుల కోసం పోరాడిన పీజేఆర్ తనకు ఎంతో సన్నిహితుడని, ఆయన కుటుంబానికి బీఆర్ఎస్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ విష్ణువర్ధన్రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో విష్ణువర్ధన్రెడ్డికి సరైన గుర్తింపు ఇస్తామని, కుటుంబసభ్యుడిగా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో తెలంగాణ బిడ్డలకు ముఖ్యమంత్రి ఇచ్చే గౌరవాన్ని ప్రజలంతా సంతోషంగా స్వాగతిస్తున్నారు.
మంగళవారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలోకి చేరేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డికి ప్రస్తుత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తోపాటు బీఆర్ఎస్ సీనియర్ నేత డా.దాసోజు శ్రవణ్, నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు సీఎన్.రెడ్డి, దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్ తదితరులు ఆత్మీయ స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ చేతులమీదుగా గులాబీ కండువా కప్పుకున్న విష్ణువర్ధన్రెడ్డికి కరచాలనం చేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సాదరంగా పార్టీలోకి స్వాగతం పలకడం పార్టీ శ్రేణులకు ఆనందాన్ని కలిగించింది.