కరెంట్ కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా..?, రైతుబంధు కావాల్నా.? రాబంధు కావాల్నా.?, ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం బోథ్ నియోజకవర్గం అభ్యర్థి అనిల్ జాదవ్, ఆదిలాబాద్ నియోజకవర్గం అభ్యర్థి జోగు రామన్నకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. “ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల ముఖాలు తెల్లబడుతున్నయి. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గులు వచ్చి తెలంగాణను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఈ రెండు జాతీయ పార్టీల కుట్రలను తిప్పికొడుతూనే బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలిపింది. పది గుడిసెలు ఉన్న గూడెంలో కూడా భగీరథ నీటితో ప్రతి గొంతు తడిపాం.
రైతులకు నీటి తీరువా రద్దు చేశాం., రైతు బంధు ఇచ్చినం., పండించిన ధాన్యాన్ని కొంటున్నాం. ధరణి తెచ్చి భూములకు రక్షణ కల్పించాం. పింఛన్ రూ.5వేలకు, రైతు బంధును రూ.16 వేలకు పెంచుకోబోతున్నాం. 58 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా, కరెంటు తేకుండా ప్రజలను అరిగోసపెట్టింది. పదేండ్లుగా బీజేపీ పార్లమెంట్ చట్టాలను ఉల్లంఘించి ఇబ్బంది పెడుతూనే ఉన్నది. ఇక్కడ ఉన్న ఎంపీలకు అడిగే దమ్ములేదు.. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తున్నరు. ఇవ్వాళ కాంగ్రెసోడు వచ్చి ధరణిని బంగాళాఖాతంలో వేసి.. దళారుల రాజ్యం తెస్తాం., 24 గంటల కరెంటు ఊడపీకి.. 3గంటల కరెంటు ఇస్తాం.., కబ్జాలు, దోపిడీల రాజ్యం తెస్తాం.., రైతుబంధు, రైతు బీమాకు రాంరాం.. చెప్తాం.. మా పాలసీ ఇదే.. అమలు చేస్తాం అంటున్నరు. కాంగ్రెస్, బీజేపీలతో చాలా ప్రమాదం పొంచిఉన్నది. ఏ మాత్రం కిందిమీది చేసినా.. గడబిడ అవుతుంది. వంద శాతం రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. డౌటేలేదు.. మూడోసారి అధికారంలోకి రాగానే ఇప్పుడున్న పథకాలన్నింటినీ బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తాం.” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.