ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. స్వతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా మన దేశంలో పరిణతి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం అభ్యర్థి జాజుల సురేందర్, మెదక్ నియోజకవర్గం అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గులాబీ జెండా పుట్టింది మీ కనుసన్నల్లోనే.. బీఆర్ఎస్ చరిత్ర మీ కండ్లముందే ఉన్నది. రైతు బాగుంటేనే.. దేశం బాగుంటుందనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ తీసుకువచ్చి చెరువులు నింపినం.
24 గంటల కరెంటు ఇస్తున్నం. మంచినీళ్ల బాధలు తీర్చినం.. పంటలు, పరిశ్రమలు పెరిగాయి.. పెట్టుబడులు వస్తున్నయ్.. ఐటీ రంగం విస్తరించింది.. రాష్ట్రం తలసరి ఆదాయంలో నం.1 స్థానంలో నిలిచింది. ధరణి, రైతుబంధు, 24 గంటల కరెంటుతో రైతుల ముఖం తెల్లవడుతున్నది. నాడు చప్రాసీ నౌకరి ఉన్నోడికి పిల్లను ఇచ్చారు.. ఇవాళ భూమి ఉన్నోడికే పిల్లను ఇస్తమంటున్నరు. ఇవన్నీ మరో ఐదు, పదేండ్లు అమలవుతే.. రైతులు కుదుటపడుతరు.
తెలంగాణ ప్రజలు క్షేమంగా ఉండాలంటే పార్టీల నడవడిక, చరిత్ర గురించి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతులు నష్టపోతరు. మీ ఓటుతోనే.. మీ వేలితోనే మీ కన్ను పొడిపించాలని కాంగ్రెస్ చూస్తున్నది. ఆ పార్టీ నాయకులు అనాలోచితంగా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు. ధరణి ఎత్తేస్తాం.. 3 గంటల కరెంటు ఇస్తాం, ఇదే మా పాలసీ అని చెబుతున్నరు. మూడు గంటల కరెంటుతో మొదటి మడి తడుస్తదా..? ఇదే దొంగ కాంగ్రెస్ను నమ్మి కర్ణాటక రైతులు ఓటేసి ఇప్పుడు గొడగొడ ఏడుస్తుండ్రు. ఇక్కడ మీరు కూడా మోసపోతే.. మళ్లీ గోసపడుతాం. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రానున్న రెండేండ్లలో ఒక ఎకరం కూడా మిగలకుండా పారించే బాధ్యత నాది. అని సీఎం కేసీఆర్ అన్నారు.