తెలంగాణ రాష్ర్టాన్ని ముంచిందే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. “బావులకాడ మీటర్లు పెట్టి.. బిల్లులు వసూలు చేయాలని ప్రధాని మోదీ బెదిరిస్తే.. చచ్చినా పెట్టనని చెప్పిన. సంవత్సరానికి రూ.5వేల కోట్లు.. ఇప్పటికే రూ.25వేల కోట్లు కట్ చేసిండు.
అయినా నేను కాంప్రమైజ్ కాలేదు.. 24 గంటల కరెంటు ఆపలేదు.. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. మనకు ఒక్క కాలేజీ అన్న ఇవ్వొద్దా..? నవోదయ పాఠశాలలు పెట్టాలని 100 ఉత్తరాలు రాస్తే.. ఒక్కటికూడా ఇవ్వలే. మన ఎంపీలు పార్లమెంట్లో గడిబిడి చేసినా పట్టించుకోలే.. మరి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. రేపు బీజేపోడు వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతడు.” “ 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏపాటి అభివృద్ధి చేసింది. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలే.. లంబాడీ, గిరిజన బిడ్డలను పట్టించుకోలే.. మళ్లీ ఇప్పుడొచ్చి ధరణి తీసేస్తాం.. రైతుబంధు నిలిపేస్తాం..
మూడు గంటలే కరెంటు ఇస్తాం.. మా పాలసీ ఇదే.. ఇంప్లీమెంట్ చేస్తామని ఓపెన్గా చెప్తున్నరు.” రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ చరిత్ర తెలుసు. రైతు స్థిరంగా ఉండాలని, వ్యవసాయ స్థిరీకరణ జరగాలని ఆలోచన చేసి ప్రపంచంలోనే ఎక్కడలేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను పుట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రానున్న రోజుల్లో రైతుబంధును రూ.16వేలకు పెంచుతున్నాం. ఇవాళ పెరిగిన భూముల ధరలకు.. ధరణి పోర్టల్ లేకుంటే వీఆర్వోలు చేసిన గోల్మాల్కు ఎన్ని హత్యలు అవుతుండే.
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా 1018 రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టుకుని, వాటినే రెసిడెన్షియల్ కాలేజీలుగా మార్చుకున్నాం. తలసరి ఆదాయం, విద్యుత్ రంగంలో నాడు 19, 20వ స్థానంలో ఉన్న మనం నేడు మొదటి స్థానంలో నిలిచాం. ఇలా అనేక రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది..? ఎట్లున్న తెలంగాణ ఎట్లయ్యింది..?ఓటేసేటప్పుడు ఇవన్నీ ప్రజలు ఆలోచన చేయాలె.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు అవసరం లేదు.. మూడు గంటలు ఇస్తే చాలు అంటున్నడు. కాంగ్రెస్ గెలిస్తే.. 10హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలట. రైతులు 10హెచ్పీ మోటర్లు పెట్టుకోగలరా..? రాష్ట్రంలో మొత్తం 33 లక్షల మోటర్లు ఉన్నయ్. ఈ మోటర్లు ఎవరు కొనియ్యాలే. ఎంత డబ్బు కావాలి. వీని తాత ఇస్తడా..? అయ్య ఇస్తడా..? ఎక్కడి నుంచి రావాలి.? 10 హెచ్పీ మోటర్లు గుంజుడు మొదలువెడితే బోరు పొక్కలల్ల నీళ్లుంటయా.? అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగమై ఓట్లేయ్యొద్దు. మేం ఆరుచందమామలు తెస్తం.. మేం ఏడు సూర్యుళ్లను తెస్తం అని తియ్యమాటలు చెప్పేటోళ్లను నమ్మి ఓటెయ్యొద్దు.
ఇబ్రహీంపట్నంలో రూ.700 కోట్లతో రోడ్లను విస్తరించాం.. అభివృద్ధి చేశాం. అద్భుతమైన రిజినల్ రింగ్రోడ్డు వస్తున్నది. దీంతో నియోజకవర్గం ముఖచిత్రమే మారిపోతది. కలెక్టరేట్ ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాం. కోహెడలో పండ్ల మార్కెట్ వస్తున్నది. లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే ఫాక్స్కాన్ పరిశ్రమ కూడా వస్తుంది. 600 ఎకరాల భూమి తీసిపెట్టినం. ఇబ్రహీంపట్నంలో మెడికల్ కాలేజీప్రారంభంకాబోతున్నది. ఎవడు ఆపినా ఆగవు. ఇప్పటికే అన్ని ఆఫీసులు తెచ్చి పెట్టుకున్నాం. నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఉంది.