హైదరాబాద్ : ఎదుటి మనిషిని ప్రేమించడమే మానవజాతి అభిమతం కావాలి. ఎదుటి వారిని ప్రేమించడమే అత్యుత్తమ మతం అని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ మనం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. మానవ మనుగడ ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఈ భోగోళం మీద ప్రారంభమైంది. మానవ జీవితం అతి ఉజ్వలంగా ముందుకు సాగడానికి ఏ తరంలో చేపట్టాల్సిన పనులను ఆ తరంలో చేపట్టారు. దాంతో మనం ఇవాళ ప్రశాంతంగా బతుకుతున్నాం. శాస్త్రవేత్తలు ఎన్నో అమూల్యమైన విషయాలను ఈ సమాజానికి సమకూర్చారు. ఈ రోజు మనం నివసిస్తున్న నాగరిక సమాజానికి చేరుకోవడానికి ఎంతో మంది మహానుభావులు త్యాగాలు చేశారు. స్థూలంగా మనిషిగా ఉన్న ప్రతి మనిషి ఎదుటి మనిషిని ప్రేమించడమే అతి గొప్ప లక్షణం. ఏ మతంలో కూడా తప్పు చేయమని చెప్పలేదు. అందరూ శాంతిగా బతకాలని చెప్పారు. తప్పులు చేయమని ఏ మతబోధకులు చెప్పలేదు. ఏ మతంలో కూడా తప్పులేదు. మతం ఉన్మాదస్థితికి వెళ్లినప్పుడే తప్పు జరుగుతోంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.