‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరాఠా ప్రజల మనసు గెలిచారు. తెలంగాణ వెలుపల భారత రాష్ట్ర సమితి నిర్వహించిన తొలి అంతర్రాష్ట్ర సభ దిగ్విజయమైంది. గోదావరి నదీ తీరానికి 2 కిలోమీటర్ల దూరంలోని నాందేడ్లో ఆదివారం నిర్వహించిన
సభకు అశేష జనవాహిని తరలివచ్చింది. వయస్సుతో సంబంధం లేకుండా మరాఠా నేలపై గులాబీ
దళపతికి వచ్చిన జనాభిమానం నదీ ప్రవాహంలా కొనసాగింది. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ కోసం పిడికిలెత్తిన కేసీఆర్.. ఇప్పుడు మరోమారు దేశం కోసం జై భారత్ అంటూ నినదించారు. ఉద్యమ
సాధకుడే దేశానికి మార్గదర్శకుడిగా మారుతున్న వేళ.. కేసీఆర్ వెంటే మేమంతా అంటూ
మహారాష్ట్ర ప్రజలు జై కొట్టారు. అందరినీ ఆలోచింపజేస్తూ, వాస్తవాలను ప్రజల ముందు
ఉంచుతూ బీఆర్ఎస్ అధినేత ప్రసంగిస్తున్నంతసేపూ జై కేసీఆర్… జై భారత్ నినాదాలతో
సభా ప్రాంగణం మారుమోగింది.
విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకించినందుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను మహారాష్ట్ర నాందేడ్లో కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐసీఈఎఫ్), తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) నాయకులు సదానందం, వెంకటనారాయణరెడ్డి, జనప్రియ,
పీవీ రావు, గోపాల్రావు, గోపాలకృష్ణ, బాగయ్య తదితరులు
మహారాష్ట్రలో అనారోగ్యంతో పీహెచ్సీలకు పోతే డాక్టర్లు ఉండరు. మందులు ఉండవు. తెలంగాణ సరిహద్దులోని మరాఠా ప్రజలంతా ఎక్కువ మంది పెద్ద రోగాలొస్తే ధర్మాబాద్, నాందేడ్ ఆసుపత్రులకే పోతరు. ఇక్కడ వైద్య సేవలు అంతంత మాత్రమే. గర్భిణులను సర్కారు దవాఖానలో పట్టించుకునే వారే ఉండరు. అదే తెలంగాణలో సీఎం కేసీఆర్ దవాఖానలను మంచిగ చేసిండు. రూపాయి ఖర్చు లేకుండా సేవలు అందిస్తున్నారు.
– గజానంద్, హద్గాం, నాందేడ్ జిల్లా
నేను ఇనుము తుక్కు వ్యాపారం చేస్త. తెలంగాణ సీఎం కేసీఆర్ వస్తున్నారని తెలిసి దుకాణం బంద్ చేసి ఇక్కడికి వచ్చిన. సభలో ఆయన చెప్పిన మాటలు చదువుకోని వాళ్లకు కూడా మంచిగ అర్థమయ్యాయి. రైతులు, కులవృత్తులు, మైనార్టీల వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఆయన బరాబార్ ప్రధాని అవుతారు.
– షేక్ సద్దాం,చిరు వ్యాపారి, నాందేడ్
మా చుట్టాలు చాలా మంది తెలంగాణలో ఉన్నారు. కేసీఆర్ ఇస్తున్న పథకాల గురించి వారు చెబుతుంటే ఆశ్చర్యమనిపిస్తుంది. కేసీఆర్ ప్రధాని అయితే దేశం మొత్తం బాగుపడుతది. ఇక్కడ కేసీఆర్ సభ ఉందంటే చూసేందుకు వచ్చిన. ఆడ పిల్లల పెండ్లిళ్లకు రూ.1,00,116 ఇస్తున్నామని చెప్పారు. ఆడ పిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తున్నారు. తల్లీబిడ్డల కోసం రూ.2 వేల విలువైన వస్తువులు కూడా ఇస్తున్నారు. మా రాష్ట్రంలో ఇలాంటి పథకాలు లేవు.
– దేవనపల్లి ప్రభావతి, నాందేడ్
నాకు ఐదు ఎకరాలుంది. పంట పెట్టుబడులకు ఇబ్బందిగా ఉంది. మా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదు. కిసాన్బంధులో ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామన్నరు. ఏదైనా కారణంతో చనిపోతే రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇస్తామన్నరు. ఉచిత విద్యుత్ అందిస్తామన్నరు. వృథాగా పోతున్న సాగునీటి ఎలా వినియోగించుకోవాలో అర్థమయ్యేలా వివరించారు. కేసీఆర్ మాటలు వింటే రైతులను ఆదుకునే నాయకుడు అనిపించింది. మహారాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్పై నమ్మకం ఏర్పడింది.
– గోవింద్ చౌహాన్, రైతు, కర్బాలా, నాందేడ్ జిల్లా
కేసీఆర్ 45 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడారు. దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రకు ఏం చేస్తామనే విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు. మా వాడ నుంచి 100 మంది మహిళలం వచ్చినం. మాతో పాటు సభలో ఉన్నవారంతా ఆయన చెబుతున్న విషయాలను ఆసక్తిగా విన్నారు. దేశంలోనే కేసీఆర్ గొప్ప నాయకుడు.
– దేవి, ఎంఐడీసీ, నాందేడ్
నేను 250 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చిన. తెలంగాణ పథకాల గురించి ఇక్కడ డాక్యుమెంటరీ ప్రదర్శించారు. టీఎస్ ఐపాస్ ద్వారా అనేక పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయి. లక్షలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుంది. కేసీఆర్ ప్రసంగం విన్న తర్వాత ఆయన గొప్ప నాయకుడనిపించింది.
– వందన, కోయిలారి, అమరావతి జిల్లా
ధర్మం పేరుతో, కుల, మతాలు, రంగురంగుల జెండాల పేర్లతో విభజన చెందకుండా అన్నదాతలంతా ఏకతాటిపైకి వస్తేనే రైతు ప్రభుత్వ స్థాపన సాధ్యం అవుతుంది. రైతు సోదరులారా.. 75 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ సమయం. ఇప్పటికైనా రైతు ప్రభుత్వం రావాలి. రైతులు హలాలు పట్టి దున్నడమే కాదు.. కలాలు పట్టి చట్టాలు లిఖించాల్సిన సమయం వచ్చింది. దేశంలో రైతుల బతుకులు మారాలంటే కిసాన్
సర్కార్ రావాల్సిందే
వచ్చే ఎన్నికల్లో రైతు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, గులాబీ పార్టీని అధికారంలోకి తెస్తే రెండేళ్లలో
మహారాష్ట్రతోపాటు యావత్ దేశంలో వెలుగులు నింపుతాం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కిసాన్ బంధు అమలు చేస్తాం. ఈ పథకం ద్వారా ఎకరానికి రూ.10వేలు ఇస్తాం. తల్వార్ పట్టుకుని యుద్ధం చేయమని చెప్పడంలేదు. ఈవీఎం బటన్ నొక్కండి చాలు. నీళ్లు వస్తాయి, కరెంటు వస్తుంది.