బేగంపేట్/ కంటోన్మెంట్/ బన్సీలాల్పేట్, సెప్టెంబర్ 19 : పైసా ఖర్చులేకుండా పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో సనత్నగర్ నియోజకవర్గానికి చెందిన 2వ విడత డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఇప్పటి వరకు పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. పార్టీలకతీతంగా.., ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 11,700 మందికి, 2వ విడతలో 13,200 మందికి ఈ నెల 21న ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో ఎంపిక చేసిన 500 మందికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్లో పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కార్ఖానాలోని క్యాంపు కార్యాలయంలో..
దేశంలో ఎక్కడాలేని విధంగా నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. మంగళవారం కార్ఖానాలోని క్యాంపు కార్యాలయంలో రెండవ విడత లబ్ధిదారులు లాస్యనందితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చేలా ప్రత్యేక చొరవ చూపిన లాస్యనందితకు ధన్యవాదాలు తెలిపారు. తమ సొంతింటి కల నెరవేర్చిన సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కారును మరువబోమని లబ్ధిదారులు వెల్లడించారు. తమకు అన్నివిధాల అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత, సీనియర్ నాయకులు నర్సింహముదిరాజ్, సదానంద్ గౌడ్, పనస సంతోష్, మురళీ యాదవ్, చిన్న, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
అల్లా దయతో కేసీఆర్ చల్లగా ఉండాలి
30 ఏండ్లుగా కిరాయి ఇంట్లో ఉంటున్నాం. నాకు ఐదుగురు పిల్లలు. సొంత ఇల్లు కావాలని 2016లో దరఖాస్తు చేసుకున్నా. మూడు రోజుల కిందట లాటరీలో మాకు ఇల్లు వచ్చిందని ఫోన్ వచ్చింది. అది విన్నాక మా ఇంట్లో సంతోషం నిండింది. ప్రభుత్వం మాకు గూడు కల్పించడం ఆనందంగా ఉన్నది. జీవితంలో సొంత ఇల్లు వస్తుందని ఊహించలేదు. అల్లా దయతో సీఎం కేసీఆర్ చల్లగా ఉండాలి.
– మహ్మద్ సర్వర్ ఖాన్, లబ్ధిదారుడు
పైరవీలు లేకుండా వచ్చింది
ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో చిన్న ఇంట్లో కష్టంగా జీవిస్తున్నాం. డబుల్ బెడ్రూం ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటాం. అలాంటి మాకు ఎప్పుడో ఆరు ఏండ్ల కింద ఐప్లె చేసుకుంటే ఇప్పుడు సడెన్గా ఫోన్ చేసి మీకు ఇల్లు వచ్చిందని చెప్పడంతో అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరికి మేము లంచాలు ఇవ్వలేదు. పైరవీలు చేయలేదు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం చాలా మంచి ఐడియా. ఈ ప్రభుత్వానికి ఎల్లప్పటికీ ఋణపడి ఉంటాం. సీఎం కేసీఆర్, మంత్రి తలసానికి కృతజ్ఞతలు.
– పి.జ్యోతి, కృష్ణ దంపతులు
సర్కారుపై సంపూర్ణ విశ్వాసం
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల. అలాగే, మేము కూడా ఎప్పటికైనా ఈ ప్రభుత్వం ద్వారానే సొంత ఇంటి కల నెరవేరుతుందనే విశ్వాసంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం. మాకు స్వయంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ చేసి మీకు ఇల్లు వచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్పై మేము పెట్టుకున్న విశ్వాసం నూరు శాతం నిజమైంది. ఇలాంటి ప్రభుత్వమే మళ్లీ రావాలని కోరుకుంటున్నాం.
– ఎస్.పద్మ , లబ్ధిదారు