మేడ్చల్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో బుధవారం దివ్యాంగులకు రూ. 3016 నుంచి రూ. 4016 చొప్పున పెరిగిన పింఛన్ల ప్రొసీడింగ్స్ను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇళ్లు లేని దివ్యాంగులు డబుల్ బెడ్రూమ్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొదటి ప్రాధాన్యతగా దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులతో పాటు వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా లక్షా 46 వేల 922 మందికి ప్రతి నెలా అందజేస్తున్నదని మంత్రి వెల్లడించారు.
మేడ్చల్ నియోజకవర్గంలో 6,461 మందికి..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పెంపుతో 21,863 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పెరిగిన పింఛన్తో ప్రతినేల రూ. 8 కోట్ల 78 లక్షలు ప్రభుత్వం దివ్యాంగులకు పింఛన్ల ద్వారా అందిస్తుందన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో 6,461 మందికి దివ్యాంగులకు ప్రొసీడింగ్స్ను జారీ చేసినట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి పద్మజారాణి, దమ్మాయిగూడ, ఘట్కేసర్ మున్సిపాలిటీల చైర్పర్సన్లు ప్రణీత, పావనీ, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల కష్టాలను గుర్తించిన సీఎం..
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం. దివ్యాంగులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. దివ్యాంగుల కష్టాలను గుర్తించింది సీఎం కేసీఆర్ మాత్రమే. తమకు అండగా ఉన్న ముఖ్యమంత్రి చల్లగా ఉండాలి
– సాయిలు, మేడ్చల్ జిల్లా
బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
దివ్యాంగులకు రూ. 4,016 కు పింఛను పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు దివ్యాంగుల కుటుంబసభ్యులందరూ రుణపడి ఉంటారు. దివ్యాంగులకు గతంలో వివిధ రకాల ట్రె సైకిళ్లు, పరికరాలు, త్రిచక్ర వాహనాలను అందించారు. దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం మంచిగుండాలి.
-గంగిరెడ్డి, మేడ్చల్ జిల్లా