‘సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ) :బీఆర్ఎస్ ప్రభుత్వానికి కులం లేదు.. జాతి లేదు.. మతం లేదు.. ఏ ఒక్కరినీ విస్మరించకుండా అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నం…రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్ల పెరిగితే అట్లా పథకాలు అమలు చేసుకుంటున్నం. అందరి కృషితోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది’ అని సీఎం కేసీఆర్ అన్నారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందంటూ.. రైతుల కష్టాలు తీర్చాలన్న ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నేడు దేశానికే ఆదర్శంగా తెలంగాణ రైతులు నిలిచారని చెప్పారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్, సమీకృత వ్యవసాయ మార్కెట్, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎవరెన్ని చెప్పినా.. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నేతల మాయమాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు కురిపించారు.