‘ఒకడిని ఓ పెద్ద మనిషి అడిగిండట.. నువ్వెందుకు పుట్టినవ్ వంకర అంటే.. సక్కగున్నోన్ని ఎక్కిరించడానికి అన్నడట.. ఇవాళ కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు కూడా గిట్లేఉన్నయ్.. తెలంగాణ వచ్చినంక ఎవుసానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నం.. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటు చాలంటుండ్రు.. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటును కాకి ఎత్తుకుపోయినట్టే’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు.
బుధవారం పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డిలకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం ఎన్ని గోసలు పడ్డం. అర్ధరాత్రి కరెంటు కోసం పోయి తాండూరులో 40 మంది రైతులు చనిపోయారు. గ్రామాల్లో బోర్లు, మోటర్లు కాలిపోతే సర్పంచులు, ప్రజలు పడ్డ బాధలు అప్పుడే మరిచిపోయామా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యంలో కాగ్నా నది వద్ద గుంతలు తీసి వడకట్టుకుని నీళ్లు తాగేది.
50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం కరెంటు, మంచినీళ్లు కూడా ఇయ్యలేదని మండిపడ్డారు. పదేండ్ల తెలంగాణ ప్రభుత్వంలో మారుమూల తండాలకూ మిషన్ భగరథ నీళ్లు ఇచ్చామన్నారు. తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 2014లో 1100 యూనిట్లు ఉంటే.. ఇవ్వాళ 2200 యూనిట్లు అయిందన్నారు. కరెంటు కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.