నేను పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ దుబ్బాక. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పాఠశాల పెట్టిన ఆ చదువు, భిక్షనే కారణం. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిలకు మద్దతుగా నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. మంచి, చెడు ఆలోచించి ఓటేయాలి. ఆగమాగమై ఓటేస్తే మన తలరాత తలకిందులైతది. ఐదేండ్లు శిక్ష అనుభవించాల్సి వస్తది.
తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీనే. కరెంటు, మంచినీళ్లు, సాగునీళ్లు ఇవ్వకుండా.. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులకు కారణం వారే. స్వరాష్ట్రంలో సంపద పెరిగిన కొద్ది.. పేదలకు పంచుకుంటూ పోతున్నాం. 24 గంటల కరెంటు.. పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇస్తున్నాం. కాంగ్రెసోళ్లకేమో తమాషా.. మనకేమో జీవన్మరణ సమస్య. మూడేండ్లు కష్టపడి భూ యాజమాన్య హక్కు మీ బొటనవేలికే ఇచ్చినం. అంత మంచి సిస్టం పోగొట్టుకోవద్దు. దుబ్బాకలో ఎప్పుడన్నా కత్తిపోట్లు చూశామా..? ఆ సంస్కారం ఉందా..? ఇక కత్తులే పట్టుకురావాలంటే మనకు దొరకవా.? వాని కంటే పొడవు కత్తులు తేగలుగుతం కదా..? పెద్ద సమస్యనా..? కానీ పద్ధతి కాదని మర్యాద పాటించాం.
కోపాన్ని అణిచివేసుకున్నాం. మొన్న బై ఎలక్షన్లో గెలిచినోడు నోటికి వచ్చిన వాగ్దానం చేసిండు.. ఏకాన పని జరిగిందా.? ఇటువంటి మోసకారులను నమ్మొద్దు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా అసైన్మెంట్ భూములకు పట్టాలిస్తాం. దుర్మార్గులు వచ్చి అనేక ఝూటా మాటలు చెప్తరు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. దుబ్బాక నెత్తిమీద కుండలా మల్లన్నసాగర్ తెచ్చుకున్నాం. ఎన్నికల తర్వాత నెల రోజుల్లో ఆర్డీవో ఆఫీసు, మూడు కాలేజీలు, చుట్టూ రింగ్ రోడ్డు తీసుకువస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాలను కల్లోలిత ప్రాంతాలుగా డిక్లేర్ చేసి ఎంతోమంది యువకులను కాల్చిచంపారు. ఎమర్జెన్సీ పెట్టి లక్షల మందిని జైల్లో వేశారు. మళ్లీ ఎవరి కొంప పుచ్చుకోవడానికి ఇందిరమ్మరాజ్యం తెస్తరు.? మళ్లీ ఆకలికి చావాల్నేమో..? కరెంటు షాకులతో రైతులు చనిపోవాల్నేమో..? అభివృద్ధితో పాటు ఇతర విషయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. తెలంగాణ వచ్చిన నాడు చెట్టుకొగలం, పుట్టకొగలం ఉన్నం. గతంలో ఏ పార్టీ ఏం చేసిందో ఆలోచించి ఓటు వేయాలి. అని సీఎం కేసీఆర్ అన్నారు.