రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
డ్రైవర్ల మెడపై కేంద్రం కత్తి..
అడ్డుకున్న సీఎం కేసీఆర్
714ను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఒక్కో వాహనానికి ఫిట్నెస్ ఆలస్య రుసుం రూ.50వేలకు పైగా మాఫీ
గ్రేటర్లో సుమారు 2 లక్షల మంది రవాణా కార్మికులకు లబ్ధి
హర్షం వ్యక్తం చేసిన కార్మికులు
శ్రీనివాస్ అనే వ్యక్తి 15ఏండ్లుగా ఆటోనే నమ్ముకున్నాడు. కుటుంబాన్ని పోషిస్తుండు. ఇటీవల అన్నం పెట్టే ఆ ఆటోను నడపడం మానేశాడు. కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 714 ఫిట్నెస్ పెనాల్టీ. రోజుకు రూ.50 జరిమానా విధించాలనే నిబంధనతో అతడి ఆటో ఫిట్నెస్కు రూ.1.62లక్షలు కట్టాలని వచ్చింది. అది చూసిన శ్రీనివాస్ ఏం చెయ్యాలో తెలియక ఆటోను నడపడం మానేశాడు. ఎవరికైనా అమ్ముకుందామంటే అంత పెనాల్టీ ఉన్న ఆటోను కొనేవారు లేరు. దీంతో డ్రైవర్ వృత్తి వదలాల్సి వచ్చింది.
అజీజ్ మహ్మద్ అనే వ్యక్తికి 20ఏండ్లుగా ఆటోనే జీవనాధారం. ఎలాంటి గడువు లేకుండా 714 గెజిట్ నోటిఫికేషన్ అమలుతో తన వాహన ఫిట్నెస్ జరిమానా రూ.92,800 వచ్చింది. రోజూ ఆటో నడిపితే వచ్చే రూ.400 ఆదాయం కుటుంబాన్ని పోశించడం, అద్దె ఖర్చులకే సరిపోతుండటంతో అంత జరిమానా చెల్లించడం కుదరదు. దీంతో ఆటోను మరో వ్యక్తికి అమ్ముకున్నాడు.
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): కరోనా కష్ట కాలంలో పనులు లేక ఉపాధి కోల్పోయిన డ్రైవర్లకు నాడు సీఎం కేసీఆర్ రెండు త్రైమాసికాల మోటార్ వాహన పన్ను రద్దు చేసి ఉదారతను చాటుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పన్ను వసూలే లక్ష్యంగా రవాణా కార్మికులపై 714 నోటిఫికేషన్తో మూలికే నక్కపై తాటి పండు పడినట్లు పన్ను విధించింది. రాష్ట్రంలో ‘714’ అమలుతో వసూలు చేస్తున్న ఫిట్నెస్ ఆలస్య రుసుంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన సీఎం కేసీఆర్ దాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిట్నెస్ ఆలస్య రుసుం రూ.50 చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయంతో గ్రేటర్లో సుమారు 2 లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరనున్నది.
ఒక్కో వాహనానికి రూ.50వేలకు పైగా..
ఆటోలు, క్యాబ్స్, మ్యాక్సీ, లారీ, స్కూల్ బస్సులు, గూడ్స్ అండ్ క్యారియర్స్ తదితర వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ చేయించాల్సినవి లక్షల్లో ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం రోజుకు ఆలస్య రుసుం రూ.50 పెనాల్టీ విధించింది. దీంతో ఒక్కో డ్రైవర్ ఆల్యస్యాన్ని బట్టి సుమారు రూ.50 వేల నుంచి లక్షకు పైగా చెల్లించాల్సి వస్తున్నది. అయితే తమ వాహనాలను విక్రయించినా.. పెనాల్టీ చెల్లించలేమని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కేంద్రం అమలు చేసిన 714 నోటిఫికేషన్పై రవాణా కార్మికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అనేక విమర్శలు వచ్చాయి. అయినా కేంద్రం ఏమాత్రం కనికరించలేదు. రెక్కాడితేకాని డొక్కాడని కార్మికులు అంత పెద్ద మొత్తంలో చెల్లించలేరని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 714 నోటిఫికేషన్ అమలును రాష్ట్రంలో నిలిపివేసింది. సీఎం నిర్ణయంపై రాష్ట్ర వాహన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
4లక్షల మంది కార్మికులకు లబ్ధి
కేంద్రం అనాలోచితంగా 714ను అమలు చేసి మాపై భారం మోపింది. ఇప్పటికే చాలా మంది డ్రైవర్లు ఫిట్నెస్ అదనపు రుసుం చెల్లించారు. మా డ్రైవర్ల కష్టాలను తెలుసుకున్న సీఎం 714 నోటిఫికేషన్కు సంబంధించి ఫిట్నెస్ ఆలస్య రుసుం మాఫీ చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4లక్షల మంది రవాణా కార్మికులకు లబ్ధి చేకూరనున్నది.
– సత్తిరెడ్డి, టీఏడీస్ ప్రధాన కార్యదర్శి
కేంద్రానిది రాక్షసానందం
కరోనా అని జాలి లేకుండా డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తూ 714 నోటిఫికేషన్ అమలు చేసి కేంద్రం రాక్షసానందం పొందింది. ఆఖరికి కరోనా రోజులకు కూడా ఫిట్నెస్ ఆలస్య రుసుం వర్తింపజేసింది. ఇదేం న్యాయం అని అడిగితే పట్టించుకున్న నాథుడే లేడు. రాష్ట్ర బీజేపీ నాయకులను నిలదీసినా ప్రయోజనం లేదు. మా కష్టాలను తెలంగాణ ప్రభుత్వానికి వివరించాం. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ 714 అమలును రద్దు చేశారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
–సలా ఉద్దీన్, చైర్మన్, తెలంగాణ క్యాబ్ అసోసియేషన్
కేంద్రం దుర్బుద్ధికి నిదర్శనం
ఫిట్నెస్పై ఆలస్య రుసుం చెల్లించాలని కేంద్రం 714 తీసుకొస్తే.. ఆ నోటిఫికేషన్ను తెలంగాణ సర్కార్ రద్దు చేయడం సంతోషంగా ఉంది. కొవిడ్ పాండమిక్లో పన్నులు వసూలు చేయడం కేంద్రం దుర్బుద్దికి నిదర్శనం. తెలంగాణ సర్కార్ సంఘాల నాయకుల అభిప్రాయాలను గౌరవించి అందరికీ న్యాయం చేస్తుంది.
-రాజేందర్ రెడ్డి, ప్రెసిడెంట్, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్