‘ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు మినీ భారతదేశం. ఇక్కడ అన్ని రాష్ర్టాల ప్రజలతో పాటు మన రాష్ట్రంలోని ప్రజలు కూడా ఉంటారు. విస్తరిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ రూపొందిస్తాం. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తాం. మేడ్చల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం’. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం మేడ్చల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా బలం, ఆశీర్వాదంతో తెలంగాణను అనేక రంగాల్లో నంబర్ 1గా నిలిపామన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, తలసరి విద్యుత్ వినియోగంలోనూ మొదటి స్థానంలో ఉన్నామని, మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
15 ఏండ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామని, కులమతాలకు అతీతంగా పాలన సాగుతున్నదన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా డబుల్ బెడ్రూం గృహాలు ఇచ్చామని, నగరంలో మరో లక్ష ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలో సుమారు రూ. 350 కోట్లతో తాగునీటి వసతి కల్పించామన్నారు. బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని, ఆపద మొక్కులు మొక్కే వారు వస్తారని, వారిని నమ్మొద్దని కోరారు. మేడ్చల్ ప్రజలు చైతన్యవంతులన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.