ఆటో డ్రైవర్లు ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు.. ఆటో డ్రైవర్లతో చర్చించి సముదాయించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు 5 లక్షల బీమా, ప్రతి ఏటా 12 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సుల్తాన్బజార్/జియాగూడ, ఏప్రిల్ 25: ఇన్ఫార్మల్ లేబర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు ‘చక్కా జామ్’ పేరిట ధర్నా చేపట్టారు. రెండు గంటల పాటు రోడ్డుపై ఆటోలు నిలిపి చౌరస్తాను దిగ్బంధించారు. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు పోరాడుతామని నినదించారు. అనేక సార్లు ప్రభుత్వానికి విజప్తి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఓ ఆటో డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ల ఆందోళన రణరంగంగా మారింది. పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎంజే మార్కెట్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.
సుమారు వంద ఆటోలతో ఎంజే మార్కెట్ చౌరస్తాను దిగ్భందం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు గంటల పాటు చౌరస్తాలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆటో డ్రైవర్లు ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు.. ఆటో డ్రైవర్లతో చర్చించి సముదాయించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు 5 లక్షల బీమా, ప్రతి ఏటా 12 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇతర జిల్లాల రిజిస్ట్రేషన్తో నడుస్తున్న ఆటోలను నిలిపివేయాలన్నారు. ఎల్లో ప్లేట్ కాని వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా ఆపరేట్ చేస్తున్న ఓలా, ఉబర్, రాపిడో వంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని, 15 ఏండ్లుగా ఆటో మీటర్ చార్జీలను పెంచలేదని, తక్షణమే పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ బంధు అసోసియేషన్ చైర్మన్ బాక్రి మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా ఆటోమీటర్ రేట్ కార్డు పెంచడం లేదని, దీంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆటోలను నగరంలో తిరగనీయవద్దని ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.