సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : నగరంలో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీ వాసులకు అనుకూలంగా త్వరలో ఆర్టీసీ సిటీ బస్సులు నడుపనున్నది. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా కొత్తగా వందల కొద్దీ కాలనీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆ కాలనీలకు బస్సుల కనెక్టివిటీని పెంచాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని మేజర్ కాలనీల్లో సిటీ బస్సుల అనుసంధానం పెరిగింది. త్వరలోనే మిగిలిన కాలనీల వారికి కూడా అందుబాటులోకి సిటీ సర్వీసులను తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు రూట్ సర్వే కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఆయా కాలనీలకు రోడ్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ఉదాహరణకు ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వరకు మాత్రమే నడుస్తున్న సిటీ బస్సు సర్వీసులను మెహిదీపట్నం నుంచి చెంగిచర్ల వరకు పొడిగించారు.
ర్యాక్వేవ్ నుంచి కూకట్పల్లి వరకు నడుస్తున్న సర్వీసును బాచుపల్లి వరకు పొడిగించారు. ఇప్పటికే నగరంలోని అనేక కాలనీల నుంచి మెట్రో స్టేషన్లకు సిటీ బస్సులను అనుసంధానించడం వల్ల నగర ప్రయాణికులకు ప్రయాణం సులువైంది. పైగా తక్కువ ఖర్చులోనే ఎక్కువ దూరం ప్రయాణించేలా ప్రజా రవాణా మెరుగుపడింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రయాణికులు ఫిదా అవుతున్నారు.
ఆర్టీసీ సర్వీసులను అన్ని మార్గాలకు విస్తరించడం వల్ల ప్రైవేటు ట్రాన్స్పోర్టును వీడి పబ్లిక్ ట్రాన్స్పోర్టును అధిక సంఖ్యలో ప్రయాణికులు సద్వినియోగం చేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని అన్ని ప్రధాన రూట్లలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో ఫుల్గా నిండటమే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. అయితే ఆర్టీసీ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు అనుకూలంగా మారుతున్నాయని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నది.