అబిడ్స్, నవంబర్ 14: ప్రజల జీవితాలలో వెలుగు నింపే నాయకుడే కావాలని, గోషామహల్ నియోజకవర్గంలో రాముని పేరు చెప్పి ఎమ్మెల్యే రాజాసింగ్ అభివృద్ధిని విస్మరించారని, అలాంటి నాయకుడు మనకొద్దని నగర బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రమంతటా అభివృద్ధి జరుగుతుంటే గోషామహల్ నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి నిలిచి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ బిలాల్ కార్యాలయంలో రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, టీఎస్టీఎస్ చైర్మన్ పి జగన్మోహన్రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, ఎం.ఆనంద్ కుమార్ గౌడ్, ఆశీష్ కుమార్ యాదవ్, వహీద్ అహ్మద్, పి.అనిత, ఆనంద్సింగ్, కొమ్ముల నరేందర్లతో కలిసి ఎన్నికల సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధిని విస్మరించిన రాజాసింగ్ పీడను గోషామహల్ ప్రజలకు పోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నందకిషోర్ వ్యాస్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారని, ఆయనను గెలిపించేందుకు గాను ఐదుగురు ఇన్చార్జ్లను నియమించడం జరిగిందని తెలిపారు. గోషామహల్ నియోజకవర్గం ప్రజలు లోతుగా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగుర వేసేందుకు మద్దతు తెలిపాలని కోరారు. నవంబర్ 30వ తేదీన ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి నందకిషోర్ వ్యాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గోషామహల్ నియోజకవర్గం మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరుగుతుందని, ఆ మ్యానిఫెస్టోలో దవాఖానాల అభివృద్ధి, రోడ్లు, ఐటీ, శిక్షణ క్యాంపులు తదితర అన్ని రకాల అభివృద్ధి పనులు చేసేందుకు పొందుపర్చడం జరుగుతుందని, ఎన్నికలలో ప్రజల సహకారంతో విజయం సాధించి ఒక్కొక్క హామీని నెరవేరుస్తామన్నారు. ఎమ్మెల్యేగా ఉండి చంపడానికి, చావడానికైనా సిద్ధమని మాట్లాడడం తగదన్నారు. అలాంటి నాయకుడు ప్రజలకు అవసరం లేదని ప్రజల జీవితాలలో వెలుగు నింపే నాయకుడు కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. గోషామహల్ నియోజకవర్గం గచ్చిబౌలిలా కావాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.