సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : సమతామూర్తి చిట్పండ్ కేసులో మూడవ ప్రధాన నిందితుడిని సైబరాబాద్ ఆర్ధిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేశారు. ఈవోడబ్ల్యూ డీసీపీ కే.ప్రసాద్ కథనం ప్రకారం…. మంచిర్యాల జిల్లాకు చెందిన ఎల్పుల శ్రీనివాస్(47), అతని కుమారుడు రాకేశ్(27), ఎల్బీనగర్కు చెందిన క్యాతం గణేశ్తో కలిసి 6 నెలల క్రితం సమతామూర్తి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించారు. మాదాపూర్, ఎల్బీనగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో కార్యాలయాలను తెరిచి, రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చిట్టీలు నిర్వహించారు.
మొదటి 3 నెలలు డబ్బులు చెల్లించిన వారికి 4వ నెలలో చిట్టీలను పాడి ఇస్తామని నమ్మబలికారు. ఇలా వందలాది మంది నుంచి సుమారు రూ.5 కోట్ల వరకు వసూలు చేశారు. 4వ నెలలో ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మాదాపూర్ పోలీసులు కేసును ఈవోడబ్ల్యూకు అప్పగించగా, ఈ నెల 7న ప్రధాన నిందితులైన శ్రీనివాస్, రాకేశ్లను అరెస్టు చేశారు. గురువారం మూడవ నిందితుడైన గణేశ్ను రిమాండ్కు తరలించారు. సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఆదేశాల మేరకు ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏసీపీ ఎం.హుస్సేయిని నాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.