సిటీబ్యూరో/బేగంపేట/శేరిలింగంపల్లి, అక్టోబరు 30 (నమస్తే తెలంగాణ ) : ఉత్తర భారతీయులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే ఛఠ్ పూజ వేడుకలు గ్రేటర్లో మొదటి రోజు ఆదివారం కన్నుల పండువగా సాగింది. ప్రతి యేటా కార్తికమాసంలో ఈ వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో బిహార్, ఉత్తర్ప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం, బెంగాళీ, నేపాల్ వాసులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. హుస్సేన్సాగర్ తీరానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకను సంబురంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమేశ్కుమార్, అరవింద్కుమార్, అధర్ సిన్హా, ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్లు సంజీవయ్య పార్క్ సమీపంలోని అంబేద్కర్ నగర్ ఎదురుగా ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. అలాగే రాయదుర్గం మల్కంచెరువులో ఛఠ్పూజ మహాత్సవంలో సుమారు4 వేల మంది బిహారీలు పాల్గొన్నారు.