శేరిలింగంపల్లి, జూలై 2: దేశం గర్వించే స్థాయి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చామని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో 66 జాతీయ సీనియర్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరెకపూడి గాంధీతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కప్ను ఘనంగా నిర్వహించామన్నారు. దేశానికి సరిపడే క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో క్రీడా పాలసీని తీసుకువచ్చి, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు.
రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ స్టేడియంలను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. 66వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ స్విమ్మింగ్ పోటీలను మన ప్రాంతంలో జరుపుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1173 మంది క్రీడాకారులకు రూ.39 కోట్ల 16 లక్షల 34 వేలు క్రీడాశాఖ ద్వారా ప్రోత్సాహక నగదును అందించామన్నారు. 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్, స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సాట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (సాట్స్) చైర్మన్ ఆంజనేయగౌడ్, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ కార్యదర్శి ఉమేశ్, చీఫ్ ప్యాట్రన్ కొండ విజయ్కుమార్తో పాటు పలువురు క్రీడా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.