షాబాద్, ఏప్రిల్ 9 : పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం రాత్రి చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే యాదయ్య, బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో సుమారు 200 మంది బీఎస్పీ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ 14 ఏండ్లు సుధీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. పదేళ్ల కాలంలో తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్కు పార్టీ అధినేత కేసీఆర్ అవకాశం ఇచ్చారని, అందరం కలిసికట్టుగా పనిచేసి చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13న చేవెళ్లలో జరుగనున్న కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ… చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా తనకు కేసీఆర్ అవకాశం ఇచ్చారని, మీరందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గత 40 ఏండ్లుగా తనవంతుగా కృషి చేస్తున్నానని తెలిపారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్కు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ…పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా నిలిచిన వారికి మంచి గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీలో పదవులు అనుభవించి బయటకు వెళ్లిన వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం అందరూ కష్టపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ళ ప్రభాకర్, మాజీ ఎంపీపీ మంగలి బాల్రాజ్, ఆయా నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.