Jubleehills | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ బీజేపీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి, బీజేపీ గుట్టుచప్పుడు కాకుండా చేతులు కలిపి తెలంగాణను మోసం చేస్తున్నారని మహేశ్ మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను మోసం చేశారు. రైతులు, యువత, మహిళలు, బీసీలు బాధలో ఉన్నా బీజేపీ మౌనంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. అలాంటి బీజేపీ పార్టీలో నేను కొనసాగలేనని టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుకు చెర్క మహేశ్ తన రాజీనామా లేఖను పంపారు.
గత కొన్ని సంవత్సరాలుగా నేను పార్టీకి నిజాయితీగా మరియు అంతఃకరణ శుద్ధితో పనిచేశాను. నేను నమ్మిన రాజకీయాలు ప్రజలకు సేవచేసి రాష్ట్రాన్ని బలోపేతం చేయడం. కానీ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను సరిగా పట్టించుకోలేదు, రైతులకు, యువకులకు, మహిళలకు, కుల వృత్తుల కార్మికులకు నిరాశే మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మరియు జీవితాలను పణంగా పెట్టి రాజకీయాలు చేయడం జరిగింది. ఇది నాకు ఎంతో బాధ కలిగించింది.
దేశంలో కాంగ్రెస్ మరియు బీజేపీ శతృత్వం తెలియంది కాదు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీజేపీ నాయకత్వం కలిసి అవకాశ రాజకీయాలు చేస్తూ 42% బీసీ రిజర్వేషన్స్పై సామాజిక న్యాయం కల్పించడానికి విఫలమయ్యారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా తెలంగాణకై పోరాడే పార్టీ, తెలంగాణ ప్రజల ఆశయాల మేరకు పని చేసే పార్టీ రావాల్సిన సమయం వచ్చింది. బీజేపీ పార్టీ ఏనాడూ తెలంగాణ కోసం కానీ, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ ప్రశ్నిస్తున్నట్లు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కనబడటంలేదు.
ఈ సమయంలో నా బాధ్యతగా స్వర్గీయ దివంగత నేత శ్రీ మాగంటి గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ ప్రజలకు చేసిన సేవను గుర్తిస్తూ, ఈ కష్టకాలంలో వారి కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా, వారి సతీమణి శ్రీమతి సునీత మాగంటి గారికి అండగా ఉండటమే నా బాధ్యత అని బలంగా నమ్ముతున్నాను.
తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, తెలంగాణ ప్రజల అస్తిత్వం కొరకై ఇకపై ఎటువంటి జాతీయ పార్టీలో నేను కొనసాగలేను అని గ్రహించి, బీజేపీ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. నాకు ప్రజలకు సేవ చేసే అవకాశాలు కల్పించినందుకు బీజేపీ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇట్లు,
చెర్క మహేష్