మేడ్చల్, జూన్2(నమస్తే తెలంగాణ): రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో టీఎస్ఐపాస్ కింద 4,089 పరిశ్రమలు ఏర్పడి.. రూ. 10 వేల 169 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో లక్షా80 వేల మందికి ఉపాధి లభించిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… పదో సంవత్సరంలో అడుగుపెడుతున్న తెలంగాణ ఒక సఫల రాష్ట్రంగా ప్రగతి పథంలో దేశంలోనే ముందున్నదన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.. పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం వివిధ వ్యవసాయ అభివృద్ధి పథకాలను అమలు చేస్తుండటంతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లాలో 118 బస్తీ దవాఖానలను ప్రభుత్వం మంజూరు చేయగా… 94 బస్తీ దవాఖానలను ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో లక్షా48 వేల మందికి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లను అందిస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని ఓఆర్ఆర్ వెలుపల ఉన్న 104 గ్రామాలకు రూ. 160 కోట్ల నిధులు వెచ్చించి మంచినీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో పాఠశాలల అభివృద్ధికి మొదటి దశలో రూ. 72 కోట్లతో పనులు జరుగుతున్నట్లు వివరించారు. అంతకు ముందు కీసర చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, పోలీసు అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు.
మహిళా సంఘాలకు రూ. 18.35 కోట్ల చెక్కులు..
సెల్ఫ్హెల్ప్ మహిళా సంఘాల గ్రూపులకు ప్రభుత్వం రూ. 18.35 కోట్ల చెక్కును మంత్రి మల్లారెడ్డి డీఆర్డీఏ అధికారి పద్మజారాణికి అందజేశారు. అలాగే మెప్మాకు రూ. 16 కోట్ల చెక్కులను అందించారు.
ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు
విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి మంత్రి మల్లారెడ్డి ప్రశంసా పత్రాలతో పాటు అవార్డులను అందజేశారు. 25 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించగా… ఇందులో జిల్లా అధికారులు డీఆర్వో లింగ్యానాయక్, సీఈవో దేవసహాయం, డీఆర్డీఏ పీడీ పద్మజారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, డీసీఓ శ్రీనివాస్ మూర్తి, డీసీఎస్ఓ తనూజ, వ్యవసాయాధికారి మేరీ రేఖ, కీసర ఆర్డీవో రవి, మల్కాజిగిరి ఆర్డీవో మల్లయ్య, హర్టికల్చర్ అధికారి నీరజాగాంధీ, షెడ్యూల్డ్ కూలాల జిల్లా అభివృద్ధి అధికారి వినోద్కుమార్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కలెక్టర్ అమోయ్కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీసీపీ సందీప్, ఆర్డీవోలు రవి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.