జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో వార్డు పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట డివిజన్ల పరిధిలో నాలుగు వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్కు ఎదురుగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయంపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో తక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. గత పదిరోజుల్లో జూబ్లీహిల్స్ వార్డు పరిధిలో రోజుకు సుమారు సగటున 15 నుంచి 20 ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో కొన్ని ఫిర్యాదులు నేరుగా జీహెచ్ఎంసీ గ్రీవియెన్స్ సెల్ ద్వారా వస్తుండగా కొన్ని ఫిర్యాదులు వార్డు కార్యాలయాల్లో అందుతున్నాయి. వీధిదీపాల సమస్యలు, పార్కుల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, ఫుట్పాత్ ఆక్రమణలు, చెత్త తొలగింపులో జాప్యం, కుక్కల బెడద, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు తదితర అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. వీటితో పాటు మ్యాన్హోళ్లు పొంగుతున్నాయని, వర్షపునీరు నిలుస్తోందని కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. – బంజారాహిల్స్,జూన్ 27
ఎప్పటికప్పుడు ఫిర్యాదులు పరిష్కారం
కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల ద్వారా తమ పరిధిలో పౌరులనుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఫిర్యాదులను పరిష్కరించేందుకు నిర్దేశిత గడువును విధిస్తూ సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేశారు. సిటిజన్ చార్టర్లో సూచించిన విధంగా ఫిర్యాదులను పరిష్కరించడం కోసం వార్డు కార్యాలయాల్లో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్(ఏఎమ్సీ) నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వీధిదీపాల విభాగం అధికారులు, శానిటేషన్, ఎంటమాలజీ , యూబీడీ విభాగంతో సహా పది విభాగాలకు చెందిన అధికారులు ఉదయం నుంచే ఫీల్డ్లో ఉండి తమకు వస్తున్న ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. వార్డు కార్యాలయంలో ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారినుంచి ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు ఆయా విభాగాలకు పంపించడం కోసం ఆపరేటర్ను నియమించారు. వచ్చిన ఫిర్యాదుల పురోగతిని రోజువారీగా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తున్నారు.
జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్లో పార్కును సరైన రీతిలో నిర్వహించకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు పిచ్చిమొక్కలు పెరిగిపోయాయని, పార్కులో సరిగా నీళ్లు పోయడం లేదంటూ రెండ్రోజుల క్రితం కేవీకేఎస్.ప్రసాదరావు అనే వ్యక్తి జూబ్లీహిల్స్ వార్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ ఫిర్యాదు సంబంధిత యూబీడీ విభాగం అధికారులకు పంపించడంతో అదే రోజు సాయంత్రానికి పార్కులోని పిచ్చిమొక్కలను తొలగించడంతో పాటు చెత్తాచెదారాన్ని తొలగించారు.
వార్డు కార్యాలయం సేవలు వినియోగించుకోవాలి
పౌరులకు నాణ్యమైన సేవలను మరింత చేరువలో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీతో పాటు జలమండలికి సంబంధించిన ఫిర్యాదులను కూడా ఇక్కడ స్వీకరిస్తున్నాం. పదిమంది అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. వార్డు కార్యాలయంలో వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని రకాలైన ఫిర్యాదులను ఒకే చోట ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల్లో సేవలను అందరూ వినియోగించుకోవాలి.
-సంజయ్ సింగ్, ఏఎంసీ (జూబ్లీహిల్స్ డివిజన్)