సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. నకిలీ విత్తనాల సరఫరా, క్రయ విక్రయాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులతో మంగళవారం ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాల కట్టడిలో వ్యవసాయ అధికారులకు, రాచకొండ పోలీసుల తరఫున పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్ తెలిపారు. నకిలీ విత్తనాలను అమ్మేవారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తామని, గత ఐదేళ్లలో 14 మందిపై పీడీయాక్టు నమోదు చేశామన్నారు. ప్రజలు కూడా నకిలీ విత్తనాల విక్రయాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
విత్తనాల ప్యాకెట్ల మీద అధీకృత సమాచారం, లోగో హోలోగ్రామ్ వంటి వాటిని పరిశీలించి కొనాలన్నారు. రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు దృవీకరించిన ప్రముఖ కంపెనీల విత్తనాలు మాత్రమే కొనుగోలు చేసి, బిల్లులు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను నియమించామని, వారు వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీ విత్తనాలు, ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను ముందుగా గుర్తించడం, అడ్డుకోవడం, కట్టడి చేయడం, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారనే ప్రైమరీ కాంటాక్ట్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సీపీ ఆదేశించారు. తక్కువ ధరకు పత్తి విత్తనాలు కానీ.. ఇతర విత్తనాలు ఇస్తామని మాయమాటలు చెప్పి విక్రయించడానికి వచ్చే వారి వివరాలను పోలీసులకు ఇవ్వాలని సీపీ సూచించారు. అలాంటి సమాచారాన్ని డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాలని సీపీ కోరారు. ఈ సమావేశంలో యాదాద్రి- భువనగిరి, మల్కాజిగిరి- మేడ్చల్, రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ అధికారులు, వారి సిబ్బంది పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, మే 23: రైతులకు నాణ్యత కలిగిన విత్తనాలను అందించాలనే ప్రభుత్వ విధానంలో భాగంగా మండల పరిధి కొర్రెములలోని విత్తనాల తయారీ కంపెనీలో రాష్ట్ర స్థాయి విత్తన టాస్క్ఫోర్స్ అధికారుల బృందం మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కొర్రెముల పంచాయతీ పరిధిలోని కార్తికేయ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రాష్ట్ర స్థాయి విత్తన టాస్క్ఫోర్స్ ఏడీఏ సుధాకర్బాబు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. రైతులకు నాణ్యత కలిగిన విత్తనాలు అందించాలన్న లక్ష్యంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విత్తన తయారీ కంపెనీలతో పాటు విత్తనాలు అమ్మే దుకాణాలలో తనిఖీలు ఉంటాయన్నారు. ఎవరైనా కల్తీ విత్తనాలు తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కల్తీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటీ సీఐ జేమ్స్బాబు, సర్టిఫికేషన్ అధికారి మహేశ్ బాబు, మండల వ్యవసాయాధికారి ఎంఏ బాసిత్ తదితరులు పాల్గొన్నారు.