మేడ్చల్, మే30(నమస్తే తెలంగాణ): దశాబ్దాల భూ సమస్యలు ధరణి పోర్టల్తో పరిష్కారం అవుతున్నాయి. ఎన్నో ఎండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు దరఖాస్తులు చేసుకుంటే చాలు అధికారులు పరిష్కరిస్తున్నారు. ప్రజల భూముల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం రైతుల్లో ధైర్యాన్ని నింపింది. భూ సమస్యల పరిష్కారంతో పాటు భూములపై లావాదేవీలు, రుణాలను సైతం హక్కు దారులు సులువుగా పొందేలా ధరణి మారింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 93 శాతం భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. 15 మాడ్యూల్ ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తూ భూమి యజమానులకు హక్కుదారుగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్లో 37,643 దరఖాస్తులు రైతుల నుంచి రాగా 34,531 దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు.
కన్వర్షన్ కష్టాలు లేవు
ధరణి పోర్టల్ రాక ముందు భూమి కన్వనర్షన్ అంటే చాలా కష్టంగా ఉండేది. తాసిల్దారు, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరిగి, తిరిగి వేసారిపోవాల్సి వచ్చేది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చేతులు తడుపుతూ పోవాల్సి వచ్చేది. ధరణి రాకతో నాలా పన్ను చెల్లించి, కన్వర్షన్ చేసుకోవడం సులభంగా మారింది. భూమిని కన్వర్షన్ చేసుకున్న ప్రతి ఒక్కరిది ఇదే మాట. కుషాయిగూడకు చెందిన సాంబరాజు కీసర మండలం కీసరదాయర రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 85/3/1/2/2 1.10 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిని కన్వర్షన్ చేసుకునేందుకు ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. మంగళవారం కీసర తాసిల్దారు కార్యాలయానికి ఇద్దరు సాక్షులను తీసుకొని, వచ్చాడు.
అధికారులు అప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి, కన్వర్షన్ పూర్తి చేశారు. సర్టిఫికెట్ను కూడా జారీ చేశారు. ఆయనను ధరణి తర్వాత పరిస్థితుల గురించి ఆరాతీస్తే..అమ్మో ధరణి రాకముందు నాలా కన్వర్షన్ అంటే చాలా ఇబ్బంది ఉండేది. ఒక్క రోజులో పని అయ్యేది కాదు. కనీసం ఆరు నెలలైనా పట్టేది. తాసిల్దారు కార్యాలయంలో దరఖాస్తు పెడితే వీలు చూసుకొని, అధికారులు స్పాట్కు వచ్చేవారు. ఆ తర్వాత నివేదికను ఆర్టీవో కార్యాయలానికి పంపేవారు. అధికారులు తనిఖీలు పూర్తయి కన్వనర్షన్ జరిగే వరకు ఎన్నో డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. అధికారులు చుట్టూ తిరుగుతూ ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు కన్వర్షన్ అంటే చాలా ఈజీగా మారింది. 10 నిమిషాల్లో కన్వర్షన్ జరుగుతున్నది. ధరణి తీసుకువచ్చి సీఎం కేసీఆర్ ఎంతో మేలు చేశారు.
– సాంబరాజు, కుషాయిగూడ
అప్పుడు ఏడాది.. ఇప్పుడు 10 నిమిషాలు
ధరణి భూమి కొనుగోలుదారులకు భరోసానిస్తున్నది. రిజిస్ట్రేషన్ సులభతరం కావడమే కాదు ఎన్నో అడ్డుకట్టలను తొలగించింది. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ జరిగి, పాస్పుస్తకం వచ్చే వరకు ఉన్న అనుభవాలను రైతులు మరిచిపోలేకపోతున్నారు. నేరడిమెట్కు చెందిన శిఖ చంద్రశేఖర్ తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు. మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో ఆయనకు ఎకరా భూమి ఉంది. వరి పంటను సాగు చేస్తున్నాడు. ఆ పక్కనే ఉన్న మరో 20 గంటల భూమి అమ్మకానికి రాగా కొనుగోలు చేశాడు. సోమవారం ధరణిలో స్లాట్ బుక్ చేసుకున్నాడు. మంగళవారం రిజిస్ట్రేషన్కు అవకాశం లభించింది. సాక్షులతో కలిసి వచ్చి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వడంతో పాటు రికార్డులో 20 గుంటల భూమి తన ఖాతాలో వచ్చి చేరింది.
ఆయనను కదిలిస్తే..ధరణి రాకముందు రిజిస్ట్రేషన్ జరగాలన్నా, మ్యూటేషన్ కావాలన్నా, పహాణీలో భూమి ఎక్కాలన్నా, పాస్పుస్తకం రావాలన్నా ఎన్నో ఇబ్బందులు ఉండేవని చెప్పారు. ఎకరా భూమి కొన్నప్పుడు తనకు ఎదురైనా అనుభవవాన్ని వివరించాడు. ధరణి పోర్టర్లో రాక ముందు 2016లో ఎకరా భూమిని కేశవరం కొనుగోలు చేశాను. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎకరా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఆ తర్వాత రికార్డు కోసం, పాస్పుస్తకం కోసం పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. అధికారులు ఇప్పుడిస్తాం, అప్పుడిస్తాం అంటూ తిప్పుకున్నారు. ఒకదశలో తీవ్ర నిరాశకు గురయ్యాను. తిరగంగా, తిరగంగా ఏడాదికి పాస్పుస్తకం లభించింది. అదే ఇప్పుడు 20 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 10 నిమిషాల్లో పని పూర్తయింది. ఆ రోజులు గుర్తుకొచ్చి, ఒక్కసారి అమ్మో అని ఊపిరిపీల్చుచుకున్నా.
– శిఖ చంద్రశేఖర్, నేరడిమెట్
అప్పుడు బతిమాలాల్సి వచ్చేది
మేడ్చల్, మే 30(నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూమికి పాస్పుస్తకం రావాలంటే సమయమే కాదు, డబ్బులు కూడా ఖర్చు చేయాల్సి వచ్చేది. ధరణికి ముందు పాస్పుస్తకాలు అప్పుడు అందుబాటులో ఉండేవి కావు. అధికారులను పాసుపుస్తకాల కోసం బతిమాలాలాడ్సి వచ్చేది ఇది ఓ మహిళా రైతు ఆవేదన. మంగళవారం శామీర్పేట్ తహస్దీలారు కార్యాలయానికి 20 గుంటల వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన శ్యామలను ధరణి పోర్టల్ ఏర్పాటుపై ప్రశ్నిస్తే 10 ఎండ్ల కిందట తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నది.తాము యాదగిరిగుట్ట దగ్గర 10 ఏండ్ల కిందట ఎకరా 10 గుంటల భూమిని కొన్నాం.
రికార్డులు మార్చుకొని, పాస్పుస్తకం తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం. కేశవరం నుంచి అక్కడి తహస్దీలారు కార్యాలయానికి ఎన్నోసార్లు వెళ్లాల్సి వచ్చింది. ఎంతకి పాస్పుస్తకాలు రాలేదు. తిరగడానికి, సిబ్బంది, అధికారులకు ఇవ్వడానికి అర్ధ ఎకరా భూమికి అయినంత ఖర్చు అయింది. ఇప్పుడు 20 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చిటికెలో అయింది. డాక్యుమెంట్ ఇచ్చారు. మ్యూటేషన్ కూడా జరిగింది. రికార్డులు మారాయి. ధరణి ఏటీఎం కార్డు లెక్కనే ఉంది. డబ్బులు డ్రా చేసుకుంటే వెంటనే ఖాతాల్లో నుంచి డబ్బులు కట్ అయినట్టు అమ్మినోళ్ల నుంచి కొన్నోళ్లకు భూమి వస్తుంది. ఇది చాలా బాగుంది. సీఎం కేసీఆర్ రైతులకు ఎంతో మేలు చేశారు. ధరణి పోర్టల్ను ఎప్పుడు కొనసాగించాలి.
– శ్యామల-కేశవరం
సత్వరమే సమస్యలు పరిష్కారం
ధరణి పోర్టల్తో రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం నిష్పక్షపాతంగా ధరణి పోర్టల్ను ఏర్పాటు చేసింది. ధరణి ద్వారా రైతులకు పథకాలు అందించేందుకు సులభంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 93 శాతం ధరణి పోర్టల్ దరఖాస్తులకు పరిష్కారం లభించింది. సమస్యలు పెండింగ్లో ఉన్నవారి కోసం జిల్లా కలెక్టరేట్లో ధరణి ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి సమస్యలు ఎప్పటి కప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– అమోయ్కుమార్, జిల్లా కలెక్టర్
ధరణితో సమస్యలు దూరం..
ధరణితో రైతుకు భరోసా లభించింది. ఒకప్పుడు భూ సమస్యలుంటే దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు పైసలిస్తే గాని పనులు జరగకపోయేవి. చిన్న పనికి పది రోజులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ధరణితో వెంటనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పనులన్నీ ఆన్లైన్లో జరిగిపోతుండటంతో ఎలాంటి బాదరబందీ లేదు. ధరణి పోర్టల్ను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ రైతులకు ఎంతో మేలు చేశారు.
– శంకర్, గౌడవెల్లి
ధరణి ఎంతో మేలు..
ధరణితో ఎంతో మేలు జరుగుతున్నది. గతంలో అధికారులకు తీరిక ఉండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తే గాని భూ సమస్యలు పరిష్కారం కాకపోయేవి. ధరణిని తీసుకొచ్చిన ప్రభుత్వం వెంటవెంటనే భూ సమస్యలను పరిష్కరిస్తున్నది. అంతా ఆన్లైన్ కావడంతో పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే మ్యుటేషన్, పహాణి, రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి.అన్నదాత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ధరణిని తీసుకురావడం ఆనందంగా ఉంది.
– మంద లక్ష్మారెడ్డి, కొల్తూర్