మన్సూరాబాద్, మార్చి 4: అక్రమ మార్గంలో గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ. 1.50 కోట్ల విలువైన 400 కేజీల గంజాయి, డీసీఎం, క్రెటా కారు, 5 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. హన్మకొండకు చెందిన బానోతు వీరన్న, శ్రీశైలం, హైదరాబాద్కు చెందిన కెతావత్ శంకర్నాయక్, పంజ సూరయ్యతో పాటు మరో ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడ్డారు.
సినిమా తరహాలో డీసీఎం అడుగు భాగంలో బాక్స్లను ఏర్పాటు చేసి అందులో గంజాయి ప్యాకెట్లను పెద్ద ఎత్తున నింపుతారు. ఏపీలో గంజాయిని కొనుగోలు చేసిన అనంతరం సదరు డీసీఎం వ్యాన్కు బానోతు వీరన్న, శ్రీశైలం క్రెటా కారులో ఎస్కార్ట్గా బయలుదేరుతారు. ముందు ప్రయాణిస్తూ వెనుక వారికి పోలీసుల నిఘాపై ఎప్పటికప్పుడు సెల్ఫోన్ ద్వారా సమాచారం ఇస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, అన్నవరం నుంచి పెద్ద మొత్తంలో గంజాయి కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నట్లు చౌటుప్పల్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు నిఘా పెట్టారు.
శనివారం ఉదయం 8 గంటల సమయంలో వలిగొండ నుంచి చౌటుప్పల్కు వచ్చే మార్గంలో ఎస్కార్ట్గా వ్యవహరిస్తున్న కారుతో పాటు డీసీఎంను పట్టుకున్నారు. డీసీఎంను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో సుమారు 400 కేజీల గంజాయి పట్టుబడింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. అక్రమంగా గంజాయి రవాణాకు పాల్పడుతున్న నెట్వర్క్ను ఛేదిస్తామని రాచకొండ సీపీ తెలిపారు. ఈ సమావేశంలో భువనగిరి జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర, చౌటుప్పల్ డివిజన్ ఏసీపీ ఎన్.ఉదయ్రెడ్డి, చౌటుప్పల్ సీఐ వై.మల్లికార్జున్ రెడ్డి, రూరల్ సీఐ మహేశ్, రామన్నపేట సీఐ మోతీరాం పాల్గొన్నారు.