వనస్థలిపురం, ఆగస్టు 4 : సాధారణ ప్రసూతి చేస్తున్న సమయంలో బిడ్డ మృతి చెందిన సంఘటన వనస్థలిపురం ఏరియా దవాఖానలో చోటు చేసుకున్నది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృతి చెందిందని బాలింత బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.
నాగార్జునసాగర్ ఎర్రచెరువు తండాకు చెందిన సరిత, రాందాస్ దంపతులు నందనవనంలో నివాసముంటున్నారు. గురువారం మూడో కాన్పు కోసం వనస్థలిపురం ఏరియా దవాఖానకు వచ్చారు. సాయంత్రం నార్మల్ డెలివరీ చేస్తుండగా (మగబిడ్డ) బిడ్డ మృతి చెందింది. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాగా బాలింత సరిత పరిస్థితికూడా ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా బాధితుల బంధువులు ఆందోళనకు దిగడంతో వైద్యులు, సిబ్బంది దవాఖాన నుంచి పరారయ్యారు.