సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణను మరింత పకడ్బందీగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఎక్కడపడితే అక్కడే నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను వేసి హైదరాబాద్ నగర విశిష్టతకు భంగం కల్గిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించడం.. రోజువారీగా భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు, శుద్ధి విధానంపై జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిర్మాణ వ్యర్థాల పారబోత, అపరిశుభ్రతపై ఇటీవల మంత్రి కేటీఆర్ సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, భవన నిర్మాణ వ్యర్థాలు కన్పిస్తున్నాయని, నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణ సంస్థలు, ప్రైవేట్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలోనే కమిషనర్ రోనాల్డ్రోస్ పారిశుధ్య, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను అప్రమత్తం చేశారు. వ్యర్థాల నిర్వహణ విధానంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. గాడి తప్పిన వ్యర్థాల నిర్వహణను సక్రమంగా చేసేందుకుగానూ నిర్మాణ వ్యర్థాల సేకరణకు ఒకే టోల్ప్రీ నంబర్ ఉండేలా చర్యలకు ఉపక్రమించారు. 2417, 2407 అనే టోల్ఫ్రీ నంబర్ను పరిశీలిస్తున్నారు. త్వరలో ప్రత్యేక నిఘా వ్యవస్థతోపాటు టోల్ఫ్రీ నంబర్ను ప్రజలను తెలియజేస్తామని, నాలుగు నిర్మాణ వ్యర్థాల సేకరణ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెడుతామని అధికారులు తెలిపారు. దీంతోపాటు వ్యర్థాల సేకరణలో వాహనాల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ హైదరాబాద్కు కృషి చేస్తున్న జీహెచ్ఎంసీకి ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు.
భవన నిర్మాణ వ్యర్థాలను సీ అండ్ డీ ప్లాంట్లకు తరలించాలని, ప్రజలు ఇబ్బందులు కలిగేలా అనుమతిలేని ప్రదేశాల్లో వ్యర్థాలు వేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జోనల్ పరిధిలో సర్కిళ్ల వారీగా నిర్మాణ వ్యర్థాల కలెక్షన్ పాయింట్లను ప్రజలు వినియోగించుకోవాలని, మినీ వాహనాలు, ట్రాక్టర్ల ద్వారా తరలించే వారిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఈనెల ఇప్పటి వరకు 28 మందికి చలాన్లు విధించామని ఆయన పేర్కొన్నారు. రాయదుర్గం, జీడిమెట్ల, నేరెడ్మెట్ పోలీస్స్టేషన్లలో ఉల్లంఘనులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, తాజాగా కూకట్పల్లి నెక్సాస్ మాల్పై కఠిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా వ్యర్థాలను తరలించే వాహనాలకు మొదటిసారి దొరికితే రూ.25వేలు, రెండోసారి రూ.50వేలు, మూడోసారి పట్టుబడితే రూ.లక్ష జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. వ్యర్థాలు వాహనాలకు అప్పగించిన ఇంటి యజమాని, నిర్మాణ సంస్థకు రూ.50వేలు జరిమానా వేస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు.