సుల్తాన్బజార్,మే 8 : దృష్టి మళ్లించి నగదు, బంగారం దొంగిలిస్తున్న పాత నేరస్తులను నాంపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం నాంపల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ ఖలీల్పాషా, డీఎస్ఐ సైదా వివరాలు వెల్లడించారు. మల్లేపల్లి అఫ్జల్సాగర్కు చెందిన షేక్ సద్దాం హుస్సేన్, మంగార్బస్తీ, హబీబ్నగర్కు చెందిన కాంబ్లే ఆకాశ్, కాంబ్లే కరణ్, అఫ్జల్సాగర్కు చెందిన హతగాడే విశాల్, మాంగార్ బస్తీకి చెందిన కాంబ్లే లక్ష్మణ్ ముఠాగా ఏర్పడ్డారు. పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్లకు పాల్పడటం అలవాటుగా చేసుకున్నారు. నగరంలోని పలు పోలీస్స్టేషన్లలో ఒక్కొక్కరిపై 10 నుంచి 22 కేసులు ఉండగా జైలుకు కూడా వెళ్లివచ్చారు. అయినప్పటికీ జల్సాలకు అలవాటుపడిన ఈ ముఠా సభ్యుల బుద్ధి మారలేదు. ఈనెల 4న వికారాబాద్కు చెందిన అతెల్లి రాజేశ్వర్ నాంపల్లి మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఉన్న బస్స్టాప్లో బస్సు కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో 12మంది అతన్ని చుట్టిముట్టి మెడలో ఉన్న నాలుగు తులాల రెండు బంగారు గొలుసులను తెంచుకుని పారిపోయారు. దీంతో బాధితుడు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న డీఎస్ఐ బి.సైదా సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.లక్షా92వేల విలువచేసే రెండు నాలుగు తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను రిమాండ్కు తరలించారు.