హిమాయత్నగర్,మే 26: రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేసి, ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు పోరాటాలతో గుణపాఠం చెప్పాలని సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ పిలుపు నిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ రాకను నిరసిస్తూ గురువారం హిమాయత్నగర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి, నల్ల జెండాలు, ప్లకార్డులతో మోదీ గో బ్యాక్.. అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. నిత్యం ఇంధనం, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే వాటిని నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దద్దమ్మ పాలన చేస్తుండటంతో పేద ప్రజలు దుర్భర పరిస్థితిలోకి నెట్టి వేయబడుతున్నారని ఆరోపించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్. బోస్, సీపీఐ నాయకులు ఎస్.ఛాయదేవి, ఎం.నరసింహ, పి.ప్రేమ్పావని, కమతం యాదగిరి, ఎన్.శ్రీకాంత్, ఎస్ఏ. మన్నన్, ఆరుట్ల రాజ్కుమార్, షహనా అంజూం, కుమార్, లక్ష్మి, సురేందర్, లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.