సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కమిషనరేట్లో ఇరవై ఏండ్ల క్రితం ఉన్న నాలుగు జోన్లకు అదనంగా సెంట్రల్ జోన్ను ఏర్పాటు చేసి, ఆ జోన్ కార్యాలయాన్ని అప్పటి నగర పోలీస్ కమిషనర్ కృష్ణారావు ప్రారంభించగా.. తాను మొదటి డీసీపీగా బాధ్యతలు తీసుకున్నానని, తిరిగి నేడు సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయాన్ని సీపీ హోదాలో ప్రారంభించడం ఆనందంగా ఉందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సంతోషం వ్యక్తం చేశారు. పోలీస్ కంట్రోల్ రూంలో ఉన్న సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయాన్ని, సీసీఎస్ భవనంలోకి మార్చారు.ఈ కార్యాలయాన్ని బుధవారం సీపీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రెటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనంలోకి మార్చామని, ఆ భవనంలోకి సీసీఎస్ను మార్చినట్లు సీపీ తెలిపారు. సిబ్బంది పెరగడంతో అందుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని చెప్పారు. పాత సీసీఎస్ భవనంలో సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయం ఏర్పటయిందన్నారు. సెంట్రల్ జోన్కు మొట్టమొదటి డీసీపీగా పనిచేశానని పాత జాపకాలను గుర్తు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో జరగిన ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, సుధీర్బాబు, ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీలు విశ్వప్రసాద్, డీసీపీలు జోయెల్ డెవిస్, ప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలకు రూ. 25 లక్షల విరాళం..
ఈ కార్యక్రమానికి హాజరైన సీఎస్కే గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ కుమార్ చిమన్లాల్ సీపీ సీవీ ఆనంద్ను కలిసి నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 25 లక్షలు అందజేశారు. ఈ మేరకు సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ)లో భాగంగా చెక్కును ఆయన సీపీకి అందజేశారు.